Sunday, March 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రజా ప్రయోజనాల దృష్ట్యా మెట్రో ఫేజ్‌-1 టేకోవర్‌

ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మెట్రో ఫేజ్‌-1 టేకోవర్‌

- Advertisement -

2ఏ, 2బీ విస్తరణ కోసం కేంద్రానికి ప్రతిపాదనలు : శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడి
సభలో తీర్మానం ఆమోదం


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-1ను రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్‌ చేసుకుంటోందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి శాసనసభలో ప్రకటించారు. శనివారం సభలో పద్దులపై చర్చ సందర్భంగా మెట్రో స్వాధీనానికి సంబంధించి తీర్మానాన్ని సీఎం ప్రేవేశపెట్టారు. ”నష్టాలతో సతమతమవుతున్నామనీ, మెట్రో రైల్‌ నిర్వహణ నుంచి తప్పుకుంటామని నాలుగైదేండ్లుగా ఎల్‌అండ్‌టీ సంస్థ చెబుతోంది. ఇదే విషయాన్ని గత సెప్టెంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది.

సుదీర్ఘ చర్చల తర్వాత సంస్థ వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.13 వేల కోట్ల రుణంతో పాటు ఈక్విటీ వాటా రూ.2 వేల కోట్లను చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఎల్‌అండ్‌టీ నుంచి మెట్రో రైల్‌ను టేకోవర్‌ చేసిన తర్వాత ఎలాంటి మార్పులు లేకుండానే హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎంఆర్‌ఎల్‌) ద్వారా ప్రభుత్వం కార్యకలాపాలను నిర్వహిస్తుంది” అని సీఎం పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.

ఫేజ్‌-2లో 162 మేర కిలోమీటర్ల విస్తరణ
రెండోదశలో 162.5 కిలోమీటర్ల మెట్రో రైల్‌ విస్తరణకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని సీఎం తెలిపారు. ఫేజ్‌-2ఏ లో 76.4 కి.మీ, ఫేజ్‌-2బీ లో 86.1 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు. వివిధ వర్గాల ప్రజల నుంచి వచ్చిన డిమాండ్‌ల మేరకు హైదరాబాద్‌ కోర్‌ అర్బన్‌ రీజియన్‌కు మెట్రో నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నట్టు వెల్లడించారు. హైదరాబాద్‌ సబర్బన్‌ ప్రజల రవాణా కష్టాలు తీర్చాలని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మెట్రో రెండో దశ విస్తరణకు కేంద్రం సహకరించాలని కోరారు. ఈ క్రమంలో మెట్రో ఫేజ్‌-1 టేకోవర్‌కు సంబంధించిన తీర్మానాన్ని ఆమోదించాలని సీఎం సభకు విజ్ఞప్తి చేశారు.

విపక్ష సభ్యుల నిరసన మధ్యనే ఆమోదం
అసెంబ్లీలో తీర్మానాలను ఏకపక్షంగా ఆమోదించడం సరికాదని బీఆర్‌ఎస్‌ సభ్యులు హరీశ్‌రావు విమర్శించారు. మెట్రో తీర్మానంపై సభలో చర్చించలేదనీ, తీర్మాన ఆమోదం ఏకగ్రీవం కాదు.. ఏకపక్షమని విమర్శించారు. అభ్యంతరాలకు అవకాశమివ్వాలన్న బీఆర్‌ఎస్‌ సభ్యుల వినతిని స్పీకర్‌ పట్టించుకోలేదు. విపక్ష సభ్యుల నిరసనల మధ్యనే సభ తీర్మానాన్ని అమోదించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -