నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీలోని రాంలీలా మైదాన్ ప్రాంతంలోని సయ్యద్ ఫైజ్-ఎ-ఇలాహి మసీదు సమీపంలో చేపట్టిన బుల్డోజర్ చర్య ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. అర్థరాత్రి కూల్చివేతలకు పాల్పడటమే కాకుండా అడ్డుకున్న స్థానికులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని సీనియర్ పోలీస్ అధికారి బుధవారం ప్రకటించారు. బిఎన్ఎస్ సెక్షన్లు 221 (ప్రభుత్వ ఉద్యోగిని అడ్డుకోవడం),132 (ప్రభుత్వ ఉద్యోగిపై దాడి), 121(ప్రభుత్వ ఉద్యోగిని నిరోధించడానికి స్వచ్ఛందంగా గాయపరచడం), 191 (అల్లర్లు),223(ఎ), 3(5), ప్రభుత్వ ఆస్తికి నష్టం వాటిల్లకుండా నిరోధించే చట్టం, 1984 నిబంధనలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. హింసకు ముందుగానే కుట్ర పన్నారా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. రాళ్లు, గాజు సీసాలు విసరడంతో ఐదుగురు పోలీసులకు గాయాలయ్యాయని అన్నారు. రాళ్లదాడికి పాల్పడిన వారిని గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అన్నారు.
కోర్టు ఆదేశాల ప్రకారం.. బుధవారం ఉదయం 8.00 గంటలకు చేపట్టాల్సిన కూల్చివేత ప్రక్రియను అధికారులు అర్థరాత్రి 1.30గంటలకే ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ చర్యపై ఆగ్రహించిన స్థానికులు కూల్చివేతను అడ్డుకునేందుకు యత్నించారు. వారిని చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు టియర్గ్యాస్ ప్రయోగించారు.



