నవతెలంగాణ-హైదరాబాద్ : జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులు, ఇళ్ల స్థలాల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎస్ ఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జిల్లా మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల అత్యవసరంగా హైదరాబాద్ వెళ్లాల్సి రావడంతో మంత్రి ఫోన్ ద్వారా జర్నలిస్టులను ఉద్దేశించి ప్రసంగించారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకోబోయే కీలక నిర్ణయాలను ఈ సందర్భంగా వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదురుచూస్తున్న అక్రిడిటేషన్ కార్డుల ప్రక్రియ తుది దశకు చేరుకుందని మంత్రి పొంగులేటి తెలిపారు. రాబోయే పది రోజుల్లోనే దీనికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటామని ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు.
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇప్పటికే లోతుగా చర్చించామని మంత్రి పేర్కొన్నారు. గతంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు, న్యాయపరమైన చిక్కుల వల్ల కొంత ఆలస్యమైందని అయితే వాటన్నింటినీ అధిగమించి వచ్చే ఏడాది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం తరపున తీపి కబురు అందిస్తామని ప్రకటించారు. జర్నలిస్టుల ఆత్మగౌరవాన్ని కాపాడటం తమ ప్రభుత్వ బాధ్యతని ఆయన ఉద్ఘాటించారు.



