పర్యవేక్షణకు ఐదుగురు నిపుణులతో కమిటీ
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలో ఫుడ్ పాయిజన్ ఘటనలో మొత్తం 392 మంది రోగులకుగాను 92 మంది వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురైనట్టు నిర్ధారించారు. ఇప్పటికే ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. 18 మందికి ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. మిగతా 74 మంది ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలోనే ఉస్మానియా జనరల్ ఆస్పత్రి నుంచి వచ్చిన వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. బుధవారం ఉదయం వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆస్పత్రిని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫుడ్ పాయిజన్ అయిన సమయంలో డ్యూటీలో ఉన్న ఇన్చార్జి సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ పద్మజను విధుల నుంచి తొలగించి ఆమెను డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ వెల్ఫేర్లో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఉస్మానియా జనరల్ ఆస్పత్రి సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ బి.శంకర్కు ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రి ఇన్చార్జి సివిల్ సర్జన్ ఆర్ఎంఓగా బాధ్యతలు అప్పగించారు. కాంట్రాక్టర్ జి.జైపాల్రెడ్డి నిర్లక్ష్యం కారణంగానే ఫుడ్ పాయిజన్ జరిగినట్టుగా గుర్తించి ఆస్పత్రిలో డైట్ కాంట్రాక్టును రద్దు చేసి చెస్ట్ ఆస్పత్రి డైట్ కాంట్రాక్టర్కు తాత్కాలికంగా అప్పగించారు.
సూపరింటెండెంట్పై మంత్రి సీరియస్
ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలో ఫుడ్ పాయిజన్ ఘటనపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సీరియస్ అయ్యారు. ఆస్పత్రిని సందర్శించిన మంత్రి సిబ్బందితో మాట్లాడి ఫుడ్ పాయిజన్ ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనితపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పెషల్ ఫుడ్ వల్లే రోగులు అస్వస్థతకు గురయ్యారని మంత్రి చెప్పారు. వెంటనే డైట్ కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ను రద్దు చేయాలని సూపరింటెండెంట్ ను ఆదేశించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫుడ్ వల్లే రోగులు అస్వస్థతకు గురైనట్టు ప్రాథమికంగా గుర్తించినట్టు మంత్రి వెల్లడించారు. డైట్లో స్వీట్ ఏర్పాటు చేయడం వల్లే ఇలా జరిగి ఉండొచ్చని భావిస్తున్నామన్నారు. ల్యాబ్ రిపోర్టు వచ్చిన అనంతరం కారణాలను పూర్తి స్థాయిలో వెల్లడిస్తామని చెప్పారు. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 18 మంది రోగుల పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ఈ ఘటనలో మృతి చెందిన కిరణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించామనీ, ల్యాబ్ రిపోర్ట్ల ఆధారంగా త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని అన్నారు. మానసిక వైద్యశాలలో అస్వస్థతకు గురైన విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని వేసి పరిస్థితిని పర్యవేక్షిస్తుందని వెల్లడించారు. ప్రజలకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే ఏ స్థాయి ఉద్యోగులైనా చర్యలు తీసుకునేందుకు ఉపేక్షించబోమని మంత్రి హెచ్చరించారు.
ఫుడ్ పాయిజనా..? కలుషిత నీరా..?
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 2న ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలో చక్కెర పరమాన్నం చేశారు. దీంతోపాటు అన్నం, కూర, అరటి పండ్లు, గుడ్లను కూడా రోగులకు వడ్డించారు. ఆస్పత్రిలో నల్లా నీటిని ఆర్వో ప్లాంట్లకు పంపి వాటి ద్వారా రోగులకు సరఫరా చేస్తున్నారు. స్టీలు బిందెల్లో పట్టిన ఆ నీటిని రోగులు గ్లాసులతో ముంచుకుని తాగుతుంటారు. ఈ రెండు నమూనాలను ఉస్మానియా జనరల్ ఆస్పత్రి నుంచి వచ్చిన మైక్రోబయాలజీ బృందం సేకరించి పరీక్షల నిమిత్తం ఐపీఎంకు పంపించింది. కాగా ఈ ఘటనకు ఫుడ్ పాయిజనా..? కలుషిత నీరు తాగడమా..? అనే కోణంలో విచారణ చేస్తున్నారు.
జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో విచారణ : మంత్రి పొన్నం ప్రభాకర్
ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలో కలుషిత ఆహార ఘటనపై హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటనలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పర్యవేక్షణలో ఉన్నతాధికారులతో విచారణ జరిపించి ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఫుడ్ కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ రద్దు చేసినట్టు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని, మంత్రి దామోదర రాజనర్సింహ వైద్యులతో మాట్లాడుతూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. అస్వస్థతకు గురైన వారికి నాణ్యమైన వైద్యం అందిస్తున్నామని, ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూసుకుంటున్నామని చెప్పారు.
ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రి ఘటనపై మంత్రి సీరియస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES