మొయినాబాద్ ఫామ్హౌస్లో….
ఇన్స్టాలో పరిచయంతో సెలబ్రేషన్స్ చేసుకున్న 65 మంది
రాజేంద్రనగర్లో హుక్కా స్థావరం
రెండు చోట్లా ఎస్ఓటీ పోలీసుల దాడులు
నవతెలంగాణ-మొయినాబాద్, రాజేంద్రనగర్
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని ఓ ఫామ్హౌస్లో మైనర్ల ట్రాప్హౌస్ పార్టీ నిర్వహించారు. ఇన్స్టాలో పరిచయంతో 65 మంది కలిసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. పక్కా సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించి, 59 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరో కేసులో రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలార్దేవ్పల్లి పీఎస్ పరిధిలోని హుక్కా స్థావరంపై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పది మందిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కెనడా నుంచి హైదరాబాద్ వచ్చిన ఇషాన్ అనే వ్యక్తి జల్సాలకు అలవాటు పడ్డాడు. సెల్ఫ్ పార్టీలను కండక్ట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ట్రాప్హౌస్ పేరుతో ఇన్స్టాగ్రామ్లో పేజ్ క్రియేట్ చేసి.. సుమారు 65 మందితో ఈ నెల 4వ తేదీన మొయినాబాద్ మండలం పెద్దమంగళారం గ్రామ సమీపంలోని చెర్రీ అండ్ ఓక్స్ ఫామ్హౌస్లో పార్టీ ఏర్పాటు చేశారు. పక్కా సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు ఫామ్హౌస్పై మెరుపు దాడి నిర్వహించారు. 65 మందిలో 59 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో 22 మంది మైనర్లుగా గుర్తించారు. అందులో 5 మంది అమ్మాయిలు ఉండగా, 17 మంది అబ్బాయిలు. వీరికి డ్రగ్స్ టెస్ట్ చేయగా.. ఇద్దరికి గంజాయి పాజిటివ్ వచ్చింది. 8 విదేశీ మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. సూపర్వైజర్ ఠాకూర్ మనీష్, డీజే ప్లేయర్లు రమేష్, రోహిత్, ఫామ్హౌస్ ఓనర్ శేషగిరి, ఆర్గనైజర్ ఇషాన్తోపాటు మరో ఇద్దరు మైనర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
హుక్కా స్థావరంపై దాడులు
మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో అద్దె గదిలో నిర్వహిస్తున్న హుక్కా సెంటర్పై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేసి పది మందిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శాస్త్రీపురంలో శంషీర్ అనే ఒక వ్యక్తి గది అద్దెకు తీసుకుని కొంతకాలంగా హుక్కా సెంటర్ను నిర్వహిస్తున్నారు. సోమవారం అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. హుక్కా సేవిస్తున్న 9 మందితోపాటు నిర్వాహకుడు శంషీర్ని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న 17 హుక్కా పాట్స్, హుక్కా ఫ్లేవర్స్ స్వాధీనం చేసుకున్నారు. పది మందిని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు.
మైనర్ల ట్రాప్హౌస్ పార్టీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES