Monday, June 2, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుమిస్‌ వరల్డ్‌ సుచాత చువాంగ్‌ శ్రీ

మిస్‌ వరల్డ్‌ సుచాత చువాంగ్‌ శ్రీ

- Advertisement -

– విజేతకు రూ.8.5 కోట్ల ప్రైజ్‌ మనీ
– బ్రెస్ట్‌ క్యాన్సర్‌పై అవగాహన కల్పించడమే తన లక్ష్యమని వెల్లడి : ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి, పలువురు మంత్రులు
– సోనుసుద్‌కు మిస్‌ వరల్డ్‌ హ్యుమానిటేరియన్‌ అవార్డు
– ఎనిమిదో రౌండ్‌లో మిస్‌ ఇండియా నందిని ఎలిమినేట్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

మిస్‌ వరల్డ్‌ 72వ పోటీలో థాయిలాండ్‌కు చెందిన ఓపల్‌ సుచాత చువాంగ్‌శ్రీ ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. మిస్‌ వరల్డ్‌ 2024 క్రిస్టినా పిజ్కోవా ప్రపంచ సుందరి సుచాత చువాంగ్‌కు కిరీటాన్ని అలంకరించారు. మొదటి రన్నరప్‌గా ఇథియోపియా, రెండవ రన్నరప్‌గా మిస్‌ పోలెండ్‌, మూడవ రన్నరప్‌గా మిస్‌ మార్టినిక్‌ నిలిచారు. మిస్‌ వరల్డ్‌గా ఎంపికైన సుచాతకు రూ.8.5 కోట్ల ప్రైజ్‌ మనీ అందనుంది. సుచాత.. థారులాండ్‌లోని ఫుకెట్‌లో జన్మించారు. మొత్తం 108 దేశాలకు చెందిన కంటెస్టెంట్‌లు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ‘ఓపల్‌ ఫర్‌ హెర్‌’ ప్రాజెక్టును ప్రమోట్‌ చేసేందుకు సుచాత మిస్‌ వరల్డ్‌ పోటీల్లో పాల్గొన్నారు. దీని ద్వారా ప్రపంచ వ్యాప్తంగా బ్రెస్ట్‌ క్యాన్సర్‌పై అవగాహన కల్పించడమే తన లక్ష్యంగా పని చేస్తున్నారు. 16 ఏండ్ల వయస్సులోనే క్యాన్సర్‌ ముప్పు నుంచి బయటపడిన ఆమె.. థారులాండ్‌లో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తున్నారు. వారికి అండగా ఉండేందుకు నిధుల సేకరించడంతోపాటు, కొన్ని సంస్థలతో కలిసి పని చేస్తున్నారు. ప్రభావితం చూపే లక్ష్యంతో యువత ముందడుగు వేయాలని ఆమె పిలుపునిచ్చారు. పోటీలకు జడ్జిలుగా మిస్‌ వరల్డ్‌ సీఈవో జూలియా మోర్లీ, సినినటులు సోనూ సుద్‌, రానా దగ్గుబాటి, నమ్రత శిరోద్కర్‌, సుధారెడ్డి, జయేష్‌ రంజన్‌, మనూషి చిల్లర్‌, , డోనా వాళ్ష్‌ వ్యవహరించారు. అంతకు ముందు తెలంగాణ చేనేత వస్త్రాలతో రూపొందించిన భారతీయ సంప్రదాయ వస్త్రాలతో పోటీదారులు ఆకట్టుకున్నారు. మిస్‌ వరల్డ్‌ హ్యుమానిటేరియన్‌ (మానవతావాది) అవార్డును దగ్గుబాటి రానా చేతుల మీదుగా సోనూసుద్‌కు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ప్రముఖ నటులు చిరంజీవి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్‌, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
టాప్‌ 8లో నందిని ఎలిమినేట్‌
మిస్‌వరల్డ్‌ పోటీల్లో సత్తా చాటి క్వార్టర్‌కు చేరిన మిస్‌ ఇండియా నందిని గుప్తా టాప్‌-8లో ఎలిమినేట్‌ అయ్యారు. టాప్‌ 8లో మార్టినిక్‌, బ్రెజిల్‌, ఇథియోపియా, నమీబియా, పోలెండ్‌, ఉక్రెయిన్‌, ఫిలిప్పీన్స్‌, థాయిలాండ్‌ నిలిచాయి. ఖండాల వారీగా టాప్‌ ఇద్దరి నుంచి ఒక్కరిని షార్ట్‌ లిస్ట్‌ చేశారు. నువ్వు మిస్‌ వరల్డ్‌ అయితే ఏం చేస్తావు అని అడిగిన ప్రశ్నకు 45 సెకన్లలో మెరుగైన సమాధానం ఇచ్చిన వారికి నిర్వాహకులు అవకాశం ఇచ్చారు.
పోటీలు విజయవంతం: జూపల్లి
హైదరాబాద్‌ వేదికగా తెలంగాణ పర్యాటక ప్రమోషన్‌, సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించడమే లక్ష్యంగా నిర్వహించిన మిస్‌ వరల్డ్‌ 2025 పోటీలు విజయవంతమయ్యాయని ఆ శాఖ మంత్రి జూపల్లి ఒక ప్రకటనలో తెలిపారు. పోటీలను జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇదే అంకిత భావంతో తెలంగాణ పర్యాటకాన్ని మరింత ప్రమోట్‌ చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -