ఆందోళనలో ప్రజలు
నవతెలంగాణ – నసురుల్లాబాద్
బాన్సువాడ డివిజన్ పరిధిలోని నసురుల్లాబాద్ బీర్కూర్ మండలాల్లోని గ్రామ పంచాయతీల ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తున్న మిషన్భగీరథ నీరు కలుషితంగా వస్తోంది. తాగునీరు రంగు మారి వస్తుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నా సురుల్లాబాద్ మండలం కేంద్రంలో గత కొన్ని రోజులుగా మిషన్ భగీరథ తాగునీరు రంగు మారడం, వాసన రావడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీటిని అందిస్తోంది. సింగూర్ నుంచి సరఫరా అవుతున్న నీరు కలుషితమై తాగడానికి ఏమాత్రం పనికి రాకుండాపోతోంది. మురికితోపాటు బిందెలు, సంపుల్లో అడుగుభాగంలో మొత్తం బురద పేరుకుంటోందని, రోగాల బారిన పడే అవకాశం ఉందని గ్రామస్థులు తెలిపారు. అధికారులు స్పందించి కలుషిత నీరు సరఫరా కాకుండా చూడాలని కోరుతున్నారు.
అధికారుల మధ్య సమన్వయ లోపం
జాతీయ రహదారి వెడల్పు లో భాగంగా జేసిబిలతో భారీ గుంతలను తవ్వడంతో భగీరథ పైపు లైన్ పగిలి తాగునీరు వచ్చి గుంతలో నిండిపోయి కలుషితమై సరఫరా అవుతున్నది. కలుషితంతోపాటు రంగుమారడంతో నీళ్లను తాగడానికి గ్రామస్తులు జంకుతున్నారు. మిషన్ భగీరథ అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిరోజులుగా నీరు కలుషితమై రంగుమారి సరఫరా అవుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, ప్రత్యేక అధికారులు ఉన్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండాపోయింది.
క్లోరినేషన్ చేసిన నీటిని అందిస్తున్నామని అధికారులు చెబుతున్నా ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ, పంచాయతీ అధికారుల మధ్య సమన్వయం కొరవడడంతో సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా త్రాగునీటి అధికారులు మిషన్ భగీరథ అధికారులు సమన్వయంతో ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించాలని మండల ప్రజలు కోరుతున్నారు.