నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
గద్వాల జిల్లా కేంద్రంలోని బాలాజీ జీన్నింగ్ మిల్లులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని శనివారం గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ..పత్తి కొనుగోలు సీసీఐ ద్వారా త్వరగా ప్రారంభించాలి కానీ చాలా ఆలస్యంగా ప్రారంభిస్తున్నందుకు చింతిస్తున్నానని సీసీఐ కొనుగోలుకు కేంద్రానికి వచ్చే రైతులు కపాస్ కిసాన్ యాప్ లో ఆన్లైన్ చేసుకునే ప్రాసెస్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
భారతదేశంలోనీ వ్యవసాయంలొ కానీ రైతులలొ కానీ అంత టెక్నాలజీ ఇంకా పెరగలేదని ఈ యాప్ ప్రక్రియ రైతులకి ఇబ్బందికరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. సిసిఐ కొనుగోలు కేంద్రం వల్ల రైతులకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ యాప్ విధానాన్ని రద్దు చేసి, గతంలో లాగా కొనుగోళ్లను సరళీకృతం చేయాలని కోరారు.
డైరెక్ట్గా వచ్చి, వాహనంలో పత్తిని వే-బ్రిడ్జ్పై తూకం వేసి, వారి అకౌంట్లో డబ్బులు పడే విధానాన్ని పునః ప్రారంభించాలన్నారు.కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో పునారాలోచన చేయాలని, పత్తిలో 8-12% తేమ శాతం ఉంటేనే కొంటామనడం కూడా సరికాదని, ఇటీవల వర్షాల కారణంగా అంత తక్కువ తేమ శాతం ఉండదని, దీనివల్ల ఒక్క రైతు కూడా రాలేరని తెలిపారు. రంగు మారిన పత్తిని కూడా కొనుగోలు చేయాలని తెలిపారు. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రభుత్వాలు ఏ పని తలపెట్టిన రైతులకు మేలు చేసే విధంగా ఉండాలని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ కురువ హనుమంతు, మల్దకల్ పాక్స్ చైర్మన్ తిమ్మారెడ్డి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ ట్రిబ్యునల్ చైర్మన్ బండారి భాస్కర్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీలు రాజారెడ్డి, ఎంపీపీ విజయ్ కుమార్, ఎంపీపీ ప్రతాప్ గౌడ్, సీనియర్ నాయకులు రమేష్ నాయుడు, సత్య రెడ్డి, విక్రమ్ సింహరెడ్డి, మార్కెట్ యార్డ్ కమిటీ డైరెక్టర్లు సోమన్న, అంజి, తదితరులు పాల్గొన్నారు.



