నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్ డబ్ల్యూఎస్ అధికారులతో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వేసవికాలంలో ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పైప్లైన్ల మరమ్మతులు మరియు నిర్వహణ పనులను తక్షణమే పూర్తి చేసి నీటి సరఫరా అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు.
మోటార్ల సమస్యలు వంటి చిన్న చిన్న లోపాలను కూడా వెంటనే గుర్తించి పరిష్కరించాలని చెప్పారు. ప్రతి గ్రామంలో తాగునీటి సరఫరా సక్రమంగా జరుగుతున్నదో లేదో అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఎమ్మెల్యే సూచించారు. అదేవిధంగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి తాగునీరు సక్రమంగా అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు ఆర్ డబ్ల్యూఎస్ ఏ ఈ అధికారి నయూమ్ తదితరులు పాల్గొన్నారు.



