Wednesday, October 22, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఎంఎంటీఎస్‌లు రద్దు చేయలేదు

ఎంఎంటీఎస్‌లు రద్దు చేయలేదు

- Advertisement -

– 88 సర్వీసులు తిరుగుతున్నాయి
– పండుగల సీజన్‌లో 973 ప్రత్యేక రైళ్లు నడిపాం
– 4.80 కోట్ల మంది ప్రయాణం : ద.మ.రైల్వే జీఎమ్‌ సంజరుకుమార్‌ శ్రీవాస్తవ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

గడచిన నెలరోజుల్లో ఎమ్‌ఎమ్‌టీఎస్‌ రైళ్లను ఎక్కడా రద్దు చేయలేదని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ సంజరుకుమార్‌ శ్రీవాస్తవ తెలిపారు. నిత్యం 88 ఎమ్‌ఎమ్‌టీఎస్‌ సర్వీసులు ప్రయాణీకులకు సేవలు అందించాయని వివరించారు. మంగళవారంనాడిక్కడి రైల్‌నిలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ ఏడాది పండుగల సీజన్‌లో నడిపిన రైళ్ల వివరాలు, ప్రయాణీకుల కోసం చేసిన ప్రత్యేక ఏర్పాట్లను వెల్లడించారు. సెప్టెంబర్‌ 21 నుంచి అక్టోబర్‌ 20వ తేదీ వరకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 973 ప్రత్యేక రైళ్లతో సహా మొత్తం 1010 రైళ్లను నడిపామని తెలిపారు. వీటిద్వారా 4.80 కోట్ల మంది ప్రయాణీకులు గమ్యస్థానాలకు చేరారని చెప్పారు. దసరా, దీపావళి, ఛాత్‌ పూజల సందర్భంగా ప్రయాణీకులు రైల్వే సేవల్ని పొందారని తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రయాణీకుల సౌలభ్యం కోసం భారతీయ రైల్వేలు 12 వేలకు పైగా ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించిందని చెప్పారు. దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో ఇదే సమయంలో 684 ప్రత్యేక రైళ్లు నడిచాయనీ. ఈ ఏడాది వాటి సంఖ్య 47 శాతం పెరిగిందన్నారు. వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్న ప్రయాణీకుల కోసం రెగ్యులర్‌ రైళ్లకు 237 అదనపు కోచ్‌లను జోడించామన్నారు. పోన్‌ పరిధిలోని ప్రధాన రైల్వేస్టేషన్లపై ఒత్తిడిని తగ్గించేందుకు లింగంపల్లి, హైటెక్‌ సిటీ, చర్లపల్లి, మల్కాజ్‌గిరి వంటి 26 ప్రత్యేక హోల్డింగ్‌ పాయింట్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రయాణీకుల సౌకర్యార్థం అన్ని రకాల ఏర్పాట్లు చేశామనీ, సీసీ టీవీ నిఘాను పెంచి, ఎక్కడికక్కడ వార్‌రూంలు ఏర్పాటుచేసి, వాటిని రైల్వేబోర్డుకు అనుసంధానం చేశామని తెలిపారు. ప్రజలు రైల్వే అధికారులకు సంపూర్ణ సహాయ సహకారాలు అందించారనీ, వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌ కే పద్మజ, ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌ ఇతి పాండే, ప్రిన్సిపల్‌ చీఫ్‌ సెక్యూరిటీ కమిషనర్‌ అరోమా సింగ్‌ ఠాకూర్‌, సికింద్రాబాద్‌ డివిజన్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ డాక్టర్‌ ఆర్‌ గోపాలకృష్ణన్‌, హైదరాబాద్‌ డివిజన్‌ డీఆర్‌ఎం సంతోష్‌ కుమార్‌ వర్మ, చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ ఏ శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -