– చికిత్స పొందుతూ మృతి
– తీవ్రంగా ఖండించిన ఏఐకేఎస్
– దోషుల్ని అరెస్టు చేసి, కఠిన శిక్ష విధించాలని డిమాండ్
న్యూఢిల్లీ : రాజస్తాన్లో మరో దారుణం జరిగింది. భిల్వారా జిల్లాలో మధ్యప్రదేశ్కు చెందిన పశువ్యాపారి ఆసిఫ్ బాబు ముల్తానీ అలియాస్ షెరు సుసాదియాపై ఈ నెల 16వ తేదీ తెల్లవారుజామున హిందుత్వ గూండాల గుంపు దారుణంగా మూక దాడి చేయడంతో చికిత్స పొందుతూ ఈ నెల 20న మృతి చెందాడు. భిల్వారా పట్టణానికి సమీపంలోని లాంబియా రైలా పశువుల మార్కెట్ నుంచి కొనుగోలు చేసిన పశువులను మధ్యప్రదేశ్లోని మాండ్సువార్లోని తన స్వగ్రామానికి తరలిస్తుండగా ఈ దాడి జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆసిఫ్ బాబు ముల్తానీని జైపూర్లోని సవాయి మాన్సింగ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ మరణించారు. ఆసిఫ్ బాబు సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన భిల్వారా పోలీసులు ఐదుగుర్ని అరెస్టు చేసి, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే బాధితులపై కూడా ఆవుల అక్రమ రవాణా కేసు కూడా సమాంతరంగా నమోదు చేశారు. దీనిపై బాధితుడి సోదరుడు ఆవేదన వ్యక్తంచేశారు. దాడిచేసిన గుంపులో అనేకమంది స్వేచ్ఛగా తిరుగుతున్నారని తెలిపారు.
కాగా, ఈ ఘటనను ఏఐకేఎస్ తీవ్రంగా ఖండించింది. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పట్నుంచి దేశవ్యాప్తంగా మైనార్టీ లపై ముఖ్యంగా ముస్లింపై ఇలాంటి దాడులు ఎక్కువగా జరుగుతు న్నాయని తెలిపింది. అలాగే, మూక హత్యలకు వ్యతిరేకంగా చట్టం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించి ఏడేళ్లు గడిచినా కేంద్రం ఇంకా చట్టం చేయలేదని విమర్శించింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) మూక హత్య సమాచారాన్ని కూడా సేకరిం చడం మానివేసిందని తెలిపింది. రాజస్తాన్ ఘటనలో నిందితులందర్నీ వెంటనే అరెస్టు చేయాలని, విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కఠినమైన శిక్ష విధించాలని డిమాండ్ చేసింది. అలాగే బాధితుడి కుటుం బానికి రూ.50 లక్షల పరిహారం, ఒక ఉద్యోగం కల్పించాలని కోరింది.
రాజస్తాన్లో పశువ్యాపారిపై మూకదాడి
- Advertisement -
- Advertisement -