– కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ హెచ్చరిక
– నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
– కట్టుదిట్టంగా పదవ తరగతి పరీక్షల నిర్వహణకు ఆదేశాలు
నవతెలంగాణ – కామారెడ్డి
పదవ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణలో భాగంగా పరీక్షా కేంద్రాలకు ఎవరూ మొబైల్ ఫోన్లు తీసుకురావద్దని జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం స్పష్టం చేశారు. విద్యార్థులు, విద్యాశాఖ అధికారులు, సంబంధిత సిబ్బంది సహా ఎవరికి కూడా మొబైల్ ఫోన్లు అనుమతి లేదని తెలిపారు.
పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఇన్విజిలేటర్లతో (డిఇలు) జూమ్ లింక్ ద్వారా నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి మొబైల్ ఫోన్లు తీసుకువస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్షల నిర్వహణలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని ప్రశాంత వాతావరణంలో పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
పరీక్ష కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని, ఎటువంటి అక్రమాలకు అవకాశం లేకుండా పర్యవేక్షణను బలోపేతం చేయాలని పేర్కొన్నారు. ఈ జూమ్ లింక్ సమావేశంలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిఇలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.



