– పహల్గాంపై పార్లమెంటు సమావేశం నిర్వహించాలి
– మావోయిస్టులతో చర్చలు జరపాలి
– రాష్ట్రంలో ప్రజాసమస్యలపై పోరాటం తప్పదు
– తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి : హనుమకొండలో
– విలేకరుల సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
భారత్, పాక్లకు వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసుకుంటామని చెప్పి కాల్పుల విరమణకు ఒప్పించినట్టు అమెరికా అధ్యక్షులు ట్రంప్ చేసిన ప్రకటనపై ప్రధాని మోడీ వివరణ ఇవ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) హనుమకొండ జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ట్రంప్ జోక్యంతో కాల్పుల విరమణ జరగడంపై దేశప్రజలు అవమానంగా భావిస్తున్నారన్నారు. ట్రంప్ వ్యాఖ్యలను ప్రధాని మోడీ ఖండించకపోవడం సందేహాలకు తావిస్తోందని తెలిపారు. పహల్గాంలో ఉగ్రవాదుల దాడి విషయంలో రాజకీయాలకతీతంగా అన్నిపార్టీలు, ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి ఆపరేషన్ సిందూర్ విషయంలో మద్దతునిచ్చాయని గుర్తు చేశారు. పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడిపై కేంద్రం విదేశాల్లో ప్రచారం చేస్తున్నదనీ, పార్లమెంటుకు మాత్రం చెప్పడం లేదని విమర్శించారు. ఈ సంఘటనపై ప్రధాని పార్లమెంటు సమావేశం నిర్వహించి ఎంపీల అభిప్రాయాలు తెలుసుకోవాలని డిమాండ్ చేశారు. పహల్గాంలో దాడి చేసిన ఉగ్రవాదులను ఒక్కరినీ కూడా అరెస్ట్ చేయకపోవడం సందేహాలకు తావిస్తోందని అన్నారు.
ప్రపంచంలోనే భారత్ నాల్గవ అభివృద్ధి చెందిన ఆర్థికవ్యవస్థగా ప్రధాని మోడీ నిటి ఆయోగ్ సమావేశంలో చెప్పడాన్ని జాన్వెస్లీ తప్పుపట్టారు. ఒక శాతం ఉన్న కార్పొరేట్లు 40శాతం సంపదను కలిగి ఉన్నారని, 50 శాతం పైగా ఉన్న పేదల చేతిలో కేవలం 3 శాతం సంపద మాత్రమే ఉందని అన్నారు. దేశంలో 42 శాతం మంది ప్రజలు ఉండటానికి కనీస సౌకర్యాలు లేకుండా బతుకుతున్నారని తెలిపారు. 30శాతం మంది ప్రజలకు పౌష్టికాహార లోపముందని వివరించారు. నెలకు రూ.26 వేల కనీస వేతనమివ్వాలని కార్మికులు పోరాటం చేస్తున్నారన్నారు. ఆకలి సూచికలో భారత్ది 111వ స్థానమని తెలిపారు. ఆపరేషన్ కగార్ను ఆపివేయాలని వామపక్షాలు, మేధావులు, ప్రజాసంఘాలు డిమాండ్ చేసినా కొనసాగించడం దారుణమన్నారు. కాల్పుల విరమణకు సిద్ధమని, శాంతి చర్చలకు ఒప్పుకుంటున్నట్టు మావోయిస్టులు ప్రకటించినా కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడం పట్ల తీవ్రంగా స్పందించారు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్షా 2026 మార్చిలోపు మావోయిస్టులను లేకుండా చేస్తామని ప్రకటించడం సరికాదన్నారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శి కేశవరావు, భూమిక తదితరులను హతమార్చి శవాలను సైతం బంధువులకు ఇవ్వకుండా కేంద్ర బలగాలు శవాలతో రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు. 500 మందిని చంపేశారని, అందులో అత్యధికంగా ఆదివాసీ మహిళలే ఉన్నారని తెలిపారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన ఆరు హామీలను సీఎం రేవంత్రెడ్డి నెరవేర్చాల్సిందేనని, లేదంటే గుణపాఠం తప్పదని జాన్వెస్లీ హెచ్చరించారు. ఎన్నికలకు ముందు హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్రెడ్డి డబ్బులు లేవని, ఏం చేయాలని మాట్లాడటం సరైంది కాదని అన్నారు. గతంలో బీఆర్ఎస్ హామీలిచ్చి నెరవేర్చకుంటేనే ప్రజలు గుణపాఠం చెప్పారని తెలిపారు. పేదలు వేసుకున్న గుడిసెల స్థానంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి నిర్మించి వారికే కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 30 లక్షల మంది ఇండ్లు లేని వాళ్లున్నారన్నారు. నివాసస్థలాల కోసం గుడిసెలు వేసుకున్న పేదలను ఖాళీ చేయిస్తున్నారని తెలిపారు. నగరంలో సుందరీకరణ పేరిట వీధి వ్యాపారుల షాపులను తొలగించడం సరికాదన్నారు. వారికి వెంటనే ప్రత్యామ్నాయం చూపాలని డిమాండ్ చేశారు. వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ(ఎం) పోరాటం చేస్తోందని, ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు, జిల్లా కార్యదర్శి జి.ప్రభాకర్రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ఎం.చుక్కయ్య, బొట్ల చక్రపాణి, వీరన్న, రాగుల రమేష్, గొడుగు వెంకట్, భానునాయక్, కాడబోయిన లింగయ్య, డి.తిరుపతి, జి.రాములు తదితరులు పాల్గొన్నారు.
ట్రంప్ పాత్రపై మోడీ వివరణివ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES