సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మెన్ డాక్టర్ కె. నారాయణ
నవతెలంగాణ – నక్కలగుట్ట
అమెరికా యుద్ధోన్మాద ధోరణుల వల్ల ప్రపంచంతోపాటు భారతదేశం కూడా ఇబ్బందులు ఎదుర్కొంటోందని, ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వీడి స్పందించాలని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మెన్ డాక్టర్ కె. నారాయణ డిమాండ్ చేశారు. శుక్రవారం హనుమకొండ జిల్లా బాలసముద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ యుద్ధకాంక్ష వల్ల అనేక దేశాలు ప్రభావితమవుతున్నాయని, ఇంధన సరఫరా సమస్యలతోపాటు భారతదేశం నుంచి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు దెబ్బతింటున్నాయని, యుద్ధ ప్రభావంతో దేశంలో ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్ల మెంటులో అబద్ధాలు మాట్లాడారని ఆరోపిస్తూ కమ్యూనిస్టులు, మావోయిస్టు లపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. స్వాతంత్య్ర పోరాటంలో సీపీఐ కీలక పాత్ర పోషించిందని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ పాత్ర లేదని, మాజీ మావోయిస్టులపై ప్రభుత్వం నిర్బంధ ధోరణి అవలంబిస్తోందని, లొంగిపోయిన వారికి సరైన స్వేచ్ఛ, గౌరవం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మావోయిస్టులు ప్రజాస్వామ్య పద్ధతిలో జీవించేందుకు అవకాశం కల్పించాలని, వారిని వామపక్ష ఉద్యమంలో భాగస్వామ్యం చేయాలని పిలుపు నిచ్చారు. క్రిష్టియన్ మతంలో చేరితే ఎస్సీ హోదా రద్దు అవుతుందని వచ్చిన తీర్పు సరైనది కాదని, మతం మారినా కులం మారదని స్పష్టం చేశారు. కేంద్రం అమలు చేస్తున్న ఎస్ఐఆర్ విధానం ఫెడరల్ వ్యవస్థను బలహీన పరచడానికేనని ఆరోపించారు. సమావేశంలో సీపీఐ నాయకులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, కర్రె బిక్షపతి, నేదునూరి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
అమెరికా యుద్ధోన్మాదంపై మోడీ స్పందించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



