బీహార్లోని బెగుసరాయ్ ఎన్నికల ప్రచారంలో
ప్రధానిపై రాహుల్ విమర్శలు
బెగుసరాయ్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు ప్రధాని మోడీ భయపడటమే కాదు బడా వ్యాపారవేత్తల చేతిలో రిమోట్ కంట్రోల్గా మారారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ విమర్శించారు. బీహార్లోని బెగుసరాయ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ జీఎస్టీ అమలు, పెద్దనోట్ల రద్దు వంటి మోడీ సర్కార్ నిర్ణయాలు చిన్న వ్యాపారులను దెబ్బతీసి బడా పారిశ్రామికవేత్తలకు లాభం చేకూర్చాయని వివరించారు. తాము అధికారంలోకి వస్తే చిన్న వ్యాపారాలను బలోపేతం చేస్తామని, కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సమాజంలోని అన్నివర్గాలకు ఉపయోగకరంగా ఉండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.
నిరుద్యోగం వంటి సమస్యలను ఎత్తి చూపకుండా రీల్స్ చూస్తూ ఉండేలా ప్రధాని మోడీ యువతను ప్రోత్సహిస్తున్నారని రాహుల్గాంధీ విమర్శించారు.”ప్రధాని మోడీ తనది 56 ఇంచుల ఛాతి అని చెప్పుకుంటారు. ఆపరేషన్ సిందూర్ జరుగుతున్న సమయంలో డోనాల్డ్ ట్రంప్ మోడీకి ఫోన్ చేశారు. మోడీ గాబరాపడ్డారు, భయపడ్డారు. ఆపరేషన్ సిందూర్ను నిలిపివేయాలని ట్రంప్ చెప్పారు. రెండు రోజుల్లోనే మోడీ ఆపరేషన్ సిందూర్ను నిలిపివేశారు. నేను ఇది ఎందుకు చెబుతున్నానంటే ఇదే నిజం. అమెరికా అధ్యక్షుడు ఒక్కరికి మాత్రమే మోడీ భయపడరు. మోడీ రిమోట్ కంట్రోల్ అదానీ, అంబానీ వంటి బడా పారిశ్రామికవేత్తల చేతుల్లో ఉంది.” అని రాహుల్ అన్నారు.



