సదస్సులో కేరళ ఎమ్మెల్యే శాంతకుమారి
తిరుపతి: కేంద్రంలోని మోడీ మనువాదం దేశానికి ప్రమాదకరమని కేరళ ఎమ్మెల్యే శాంతకుమారి అన్నారు. తిరుపతి పెద్దకాపు లే ఔట్లోని యుటిఎఫ్ కార్యాలయంలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ రఘు అధ్యక్షతన ‘దళితులు- మనువాదం’ సదస్సు ఆదివారం జరిగింది. ఈ సదస్సులో శాంతకుమారి మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలపై దాడి చేస్త్తోందని, ఫెడరల్ వ్యవస్థను నాశనం చేస్తోందని అన్నారు. దళితులకు రక్షణ లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా దళిత మహిళలపై హత్యలు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయన్నారు. మోడీ విధానాలకు వ్యతిరేకంగా కేరళలో లెఫ్ట్ఫ్రంట్ ప్రభుత్వం పోరాడుతోందని వివరించారు. దళితులను పూజారులుగా కేరళ ప్రభుత్వం నియమించిందని, ఇది దేశానికి ఆదర్శమని కొనియాడారు. కేరళలో దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ ఎన్నో కార్యక్రమాలను అక్కడి ప్రభుత్వం తీసుకొచ్చిందని వివరించారు. బీజేపీి, ఆర్ఎస్ఎస్ ప్రజాస్వామ్యాన్ని, దళితుల హక్కులను కాలరాస్తూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి తూట్లు పొడిచేలా కుట్ర పన్ననున్నాయని విమర్శించారు. ఈ నేపథ్యంలో వామపక్ష, లౌకిక శక్తులు ఒక తాటిపైకి వచ్చి వీటిని ప్రతిఘటించాలని తెలిపారు.
దేశ ప్రజలను చైతన్యవంతులను చేసి రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ కడేరులో ప్రభుత్వం దళితుల భూములను దౌర్జన్యంగా సేకరిస్తోందన్నారు. టీడీపీి కూటమి ప్రభుత్వంలో దళితులపై దాడులు పెరిగాయని, రాబోయే రోజుల్లో దళితుల సమస్యలపై రాష్ట్రవ్యాప్త ఉద్యమాలు చేపడతామని కోరారు. దేశంలో బిజెపి విద్య, వైద్య, ఆర్థిక రంగాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. కేంద్రంలో మోడీ అనుసరిస్తోన్న విధానాలను తుచ తప్పకుండా చంద్రబాబు, పవన్ పాటిస్తున్నారని విమర్శించారు. టీడీపీలో అన్యమతం పేరుతో దళిత ఉద్యోగులను తొలగించారని, వారిని వెంటనే ఉద్యోగాల్లో తిరిగి కొనసాగించాలని డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం పేరుతో ఈ నెల 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకునేందుకు ఐక్య ఉద్యమాలు అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్పీఐ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు పి అంజయ్య, రిటైర్డ్ సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ విజరుకుమార్, కేవీపీఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెంకటేష్, ఎన్డి శ్రీను, ఐద్వా జిల్లా కార్యదర్శి పి.సాయిలక్ష్మి, ప్రజాసంఘాల నాయకులు అంగేరి పుల్లయ్య పాల్గొన్నారు.
మోడీ మనువాదం దేశానికి ప్రమాదకరం
- Advertisement -
- Advertisement -