నినాదాల కళలో ఆయనది మాస్టర్స్ డిగ్రీ : లోక్సభ ప్రతిపక్షనేత రాహుల్గాంధీ
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ మాటలు ఘనం..చేతలు శూన్యం అన్న చందంగా ఉన్నాయని లోక్సభ ప్రతిపక్షనేత రాహుల్గాంధీ అన్నారు. మోడీ దేశాన్ని ఉర్రూత లూగించే విధంగా నినాదా లిచ్చే కళలో మాస్టర్ డిగ్రీ చేశారని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు రాహుల్ శనివారం ఎక్స్లో పోస్టు చేశారు. ”నరేంద్ర మోడీ ఘనంగా ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదాలిస్తారు. కానీ తయారీ రంగంలో భారత్ రికార్డులో స్థాయిలో పడిపోయింది. 2014 నుంచి తయారీ రంగం 14 శాతానికి పడిపోయింది. ఆర్థిక వ్యవస్థకు కీలకమైన తయారీ రంగమే తీవ్ర క్షీణతకు గురైతే.. మేక్ ఇన్ ఇండియా ఎలా సాధ్యం” అని ఎక్స్ పోస్టులో మోడీని ఆయన ప్రశ్నించారు.” దేశ యువతలో నిరుద్యోగం పెరిగింది. భారత్ చైనా నుంచి దిగమతులు చేసుకోవడం రెండురెట్లు పెరిగిందని రాహుల్ ఎత్తిచూపారు. దేశంలో పరిస్థితి ఇలా ఉంటే.. ప్రధాని మోడీ మాత్రం నిజమైన పరిష్కారాల కంటే నినాదాలపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారు” అని ఆయన మండిపడ్డారు.
అంతేకాక ”న్యూఢిల్లీలోని నెహ్రూ ప్లేస్లో శివం, సైఫ్ అనే ఇద్దరు ప్రతిభావంతులైన యువకుల్ని కలిశాను. వారితో మాట్లాడిన తర్వాత వారు వారి కలల్ని నెరవేర్చుకోలేకపోతున్నారని నాకు అర్థమైంది. దీన్నిబట్టి చూస్తే.. భారత దేశ యువత ఎన్ని సవాళ్లను ఎదుర్కొంటుందోనని స్పష్టమైంది” అని రాహుల్ ఎక్స్ పోస్టులో హైలెట్ చేశారు. ”ప్రస్తుతం దేశంలో జరుగుతున్నది.. అభివృద్ధి చేస్తామని చెబుతూ సమావేశమవుతాము కానీ.. సొంతంగా తయారు చేసేందుకు నిరాకరిస్తున్నాము. దీంతో పొరుగు దేశమైన చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. ఆ దిగుమతుల వల్ల చైనా లాభపడుతోంది” అని అన్నారు.
”ప్రధాని మోడీకి కొత్త ఆలోచనలు లేవు. భారతదేశ పరిశ్రమలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించడం మానేశారు. ముఖ్యమైన పీఎల్ఐ (పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్) పథకాన్ని కూడా మోడీ నిలిపివేశారు. ఇప్పుడు భారతదేశానికి ప్రాథమిక మార్పు అవసరం. అదేమంటే.. నిజాయితీగల సంస్కరణలతో భారతీయ ఉత్పత్తిదారులకు ఆర్థిక సహాయమందించాలి. మన దేశం ఇతర దేశాలకు మార్కెట్గా ఉండడం మానేయాలి. భారత్ సొంతంగా పరిశ్రమల్ని నిర్మించకపోతే అది ఎప్పుడూ ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తూనే ఉంటుంది” అని రాహుల్ హెచ్చరించారు. భారత్లో పరిశ్రమల్ని నిర్మించాలని, తయారీ రంగాన్ని అభివృద్ధి చేయాలని ఆయన పోస్టులో పిలుపునిచ్చారు.
మోడీ మాటలు ఘనం చేతలు శూన్యం
- Advertisement -
- Advertisement -