మబ్బులతో రైతన్న ఆందోళన..
వర్షం పడితే వరి పంటకు నష్టం..
నవతెలంగాణ – మల్హర్ రావు: కొద్దిరోజు లుగా మేఘాలు కమ్ముకోవడం, ఈదురుగాలులు వీస్తుండడం, బుధవారం రాత్రి చిరు జల్లులు కురవడంతో రబీలో వరి సాగు చేసి ధాన్యం అమ్ముకోవడానికి పిఏసిఎస్ కొనుగోలు కేంద్రాల్లో అరబోసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో 13,780 ఎకరాల్లో వరి పంటలు సాగు చేయగా దాదాపు 9,760 ఎకరాల పంటను కోశారు. మిగతా 4,020 ఎకరాల పొలం కోతకు ఉంది. పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు కురిస్తే తమకు తీవ్ర నష్టం జరుగుతుందని, దీంతో ఆర్థికంగా ఇబ్బందులు తప్పవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలు కురిస్తే కల్లాల్లో ధాన్యం తడవకుండా టార్పాలిన్ కవర్లు కూడా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అందించడం లేదని రైతులు వాపోతున్నారు. వేసవికాలంలో పశువులకు మేత అంతంత మాత్రంగానే లభ్యమవుతుంది. వానాకాలం ప్రారంభంలో సైతం పశువులకు మేత దొరకడం కష్టంగా మారింది. రబీలో వరి సాగు చేసిన రైతన్నలు పశువుల మేతగా వినియోగిస్తుంటారు. ఈ మేత కొనుగోలు చేయడానికి పశుపోషకులు ఆసక్తి కనబరుస్తుంటారు. ఒకవేళ వర్షం కురిస్తే మేత పశువులు తినడానికి పనికి రాకుండా నేలపాలవుతుందని రైతులు పేర్కొంటున్నారు.
మొగులు.. గుబులు.!
- Advertisement -
- Advertisement -