– ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర, ఈశాన్యరాష్ట్రాలకు విస్తరణ
– నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం
– ఉత్తర తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి
– రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అన్నదాతలకు తీపికబురు. నైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకాయి. ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు విస్తరించాయి. మరోవైపు మంగళవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. ఉత్తర తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి ఛత్తీస్గఢ్ వరకు విస్తరించి ఉంది. వీటి ప్రభావం వల్ల రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పలు జిల్లాల్లో కురిసే అవకాశముంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది. ఆ జాబితాలో ఆదిలాబాద్, కొమ్రంభీం అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలున్నాయి. మిగతా జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. ఈ నేపథ్యంలో ఆ జిల్లాలకు ఎల్లో హెచ్చరికను జారీ చేసింది. వచ్చే 48 గంటల పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే సూచనలున్నాయి. సోమవారం రాత్రి 10 గంటల వరకు రాష్ట్రంలో 223 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి జిల్లా షాబాద్, మొహినాబాద్ మండలాల్లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందన్వెళ్లిలో అత్యధికంగా 8.13 సెంటీమీటర్ల భారీ వర్షం పడింది.
తెలంగాణకూ రుతుపవనాలు వచ్చేశాయి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES