– సీఎస్బీ ‘ఆపరేషన్ క్రాక్డౌన్’లో వెల్లడి
– 208 మంది నిందితుల అరెస్ట్ : టీజీసీఎస్బీ డీజీ శిఖా గోయెల్
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంతో పాటు సరిహద్దు రాష్ట్రాల్లో మూల్ అకౌంట్ల ద్వారా రూ.100 కోట్లకు పైనే మోసాలు చోటు చేసుకున్నాయని టీజీసీఎస్బీ డైరెక్టర్ జనరల్ (డీజీ) శిఖా గోయెల్ మంగళవారం తెలిపారు. వందలాదిగా వివిధ బ్యాంకుల్లో పుట్టుకొచ్చిన మూల్ అకౌంట్ల భరతం పట్టడానికి టీజీసీఎస్బీ ఆధ్వర్యాన ఫిబ్రవరి 28న ఆపరేషన్ క్రాక్డౌన్ను ప్రారంభించామని ఆమె తెలిపారు. ఈ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో జరిపిన ఈ ఆపరేషన్ క్రాక్డౌన్లో 137 బ్యాంకులలో 1888 మూల్ అకౌంట్ల బాగోతం బయటపడిందని ఆమె చెప్పారు. ఈ మూల్ అకౌంట్లకు కారకులైన నిందితులలో 208 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయడం జరిగిందని శిఖా గోయెల్ వివరించారు. మొత్తం 541 టీజీసీఎస్బీ అధికారులతో కూడిన 136 టీమ్లు ఈ క్రాక్డౌన్ ఆపరేషన్లలో పాల్గొంటున్నాయని ఆమె చెప్పారు. ఇందులో నగరంలోని జూబ్లీహిల్స్కు చెందిన రెండు బ్యాంకులకు చెందిన మేనేజర్లను కూడా ఈ కుంభకోణానికి సంబంధించి అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. వరంగల్లోని ఒక ఇంట్లోనే 45కు పైగా మూల్ అకౌంట్లు బయట పడ్డాయనీ, దీనిని బట్టి ఇలాంటి ఖాతాలు తెరవడం ద్వారా లబ్ది పొందుతారనే ఆశకు అనేక మంది గురవుతున్నారనీ, ఇది నేరమని ఆమె స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్ మున్ముందు కూడా కొనసాగుతుందని చెప్పారు.
మూల్ అకౌంట్స్ మోసాలు రూ.100 కోట్ల పైనే!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



