– డీపీఆర్పై మల్లగుల్లాలు
– ఎఫ్టీఎల్ నుంచి ఎన్ని మీటర్లు నోటిఫై చేద్దాం?
– 50 మీటర్ల పరిధిలో ఇండ్ల తొలగింపుపై క్యాబినెట్లో భిన్నాభిప్రాయాలు
– కొత్త కంపెనీల వేటలో రాష్ట్ర ప్రభుత్వం
– మూసీకి నిధులివ్వాలని కేంద్రానికి పలుమార్లు సీఎం విజ్ఞప్తి
– పట్టించుకోని మోడీ సర్కార్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మూసీ పునరుజ్జీవం ప్రాజెక్ట్ ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అన్న చందాన సాగుతోంది. నగరంలో 55 కిలోమీటర్ల పరిధిలో మూసీనదికి ఇరువైపులా 50 మీటర్ల బఫర్జోన్లోని ఇండ్లను తొలగించాలని గతేడాది సూత్రప్రాయంగా నిర్ణయించి, కొన్ని చోట్ల మార్కింగ్ సైతం చేశారు. అయితే ఈ ప్రతిపాదనను క్యాబినెట్లోని పలువురు మంత్రులతో పాటు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సైతం వ్యతిరేకించిందని తెలుస్తోంది. దాంతో ఈ ప్రాజెక్ట్ డీపీఆర్ను దక్కించుకున్న కంపెనీలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఎలా ముందుకెళ్లాలనే అంశంపై సర్కార్ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా డీపీఆర్ తయారు చేయడం తప్ప తాము చేయగలిగిందేవిూ లేదని ఆయా సంస్థలు చేతులెత్తేశాయని తెలుస్తోంది. దాంతో ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో పట్టాలెక్కే పరిస్థితి లేదని తెలుస్తోంది.
మూసీ పునరుజ్జీవంతో పాటు అవసర మయ్యే నిధుల సేకరణ లాంటి ప్రణాళికలతో డిటేయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్(డీపీఆర్) తయారు చేసే బాధ్యతను మీన్హార్ట్, కష్మన్ అండ్ వేక్ఫీల్డ్, జోహా, రియో మొదలగు ఐదు సంస్థలకు ప్రభుత్వం ఏడాది క్రితం అప్పగించింది. డీపీఆర్ సేవల కోసం రూ.141 కోట్లతో ఒప్పందం చేసుకుంది. ఆ తర్వాత ఆయా సంస్థలకే పీపీపీ ప్రాతిపదికన ప్రాజెక్టును అప్పగించేందుకు అంతర్గతంగా ఒప్పందం కుదిరిందని గతంలో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫీడ్బ్యాక్ రాకపోవడం తో ఈ ప్రాజెక్ట్ డీపీఆరే ఇంకా ఓ కొలిక్కి రాలేదని తెలుస్తోంది. మూసీనదికి ఇరువైపులా 50మీటర్ల బఫర్జోన్ లోని ఇండ్లను తొలగించాలని ప్రాథమికంగా తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. అటు మంత్రి వర్గంలోని పలువురు మంత్రులతో పాటు కాంగ్రెస్ అధిష్టానం సైతం అభ్యంతరం వ్యక్తం చేసిందని సమాచారం. దాంతో ఈ ప్రాజెక్ట్ అడుగు ముందుకు పడటం లేదని తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన సందర్భంలో డీపీఆర్ దక్కించుకున్న సంస్థలకు ప్రభుత్వం లేనిపోని ఆశలు కల్పించినట్టు తెలుస్తోంది. మూసీకిరువైపులా ఇండ్ల తొలగింపు ద్వారా దాదాపు 2 వేల కోట్ల భూమి అందుబాటులోకి రానుందనీ, ఆ మొత్తం భూమిని అప్పగిస్తామని ఆయా కంపెనీలకు హామీ ఇచ్చినట్టు సమాచారం. ఆ స్థలంలో ఆకాశహర్మ్యాలను, సుందరనందన వనాలను పీపీపీ పద్ధతిలో నిర్మించడం ద్వారా రియల్, టూరిజానికి అవకాశం కల్పిస్తామని సర్కార్ వారికి హామీ ఇచ్చింది. దాంతో ఆయా కంపెనీలు ప్రాజెక్ట్ చేపట్టేందుకు ముందుకొచ్చాయని భావిస్తున్నారు. అయితే సర్కార్ నుంచి స్పష్టమైన సంకేతాలు రాకపోవడంతో డీపీఆర్ దశలోనే మూసీ పునరుజ్జీవం ఆగింది. మూసీపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంతో ఆయా కంపెనీలు సైతం ప్రాజెక్ట్పై ఆసక్తి చూపెట్టడం లేదని తెలుస్తోంది.
మంత్రుల్లో భిన్నాభిప్రాయాలు?
మూసీ పునరుజ్జీవం ప్రాజెక్ట్ను రాష్ట్ర మంత్రివర్గంలోని పలువురు సీనియర్ మంత్రులు వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. 12వేల ఇండ్లను కూల్చేసి, లక్ష మందిని నిరాశ్రయులను చేసే ప్రాజెక్ట్ అవసరమా? అనే ప్రశ్నను వారు పలు సందర్భాల్లో సంధించారని సమాచారం. ఇలాంటి నిర్ణయాలు పార్టీకి, ప్రభుత్వానికి తీవ్ర నష్టం చేకూర్చే అవకాశం ఉందని వారన్నట్టు తెలుస్తోంది. అలాగే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సైతం మూసీ పునరుజ్జీవం ప్రాజెక్ట్ను వ్యతిరేకించింది. ఎఫ్టీఎల్, బఫర్జోన్ పరిధిలో పేదలు, మధ్యతరగతి ప్రజలు ఉండేందుకు గత్యంతరం లేక కట్టుకున్న చిన్న చిన్న ఇండ్లను తొలగించడం సరికాదని కాస్త ఘాటుగానే ఢిల్లీ పెద్దలు నిలదీసినట్టు సమాచారం.
కొత్త కంపెనీల కోసం వేట
మూసీ పునరుజ్జీవం ప్రాజెక్ట్ డీపీఆర్ను దక్కించుకున్న మీన్హార్ట్, కష్మన్ అండ్ వేక్ఫీల్డ్, జోహా, రియో కంపెనీలకు నిర్మాణ, రియల్ ఎస్టేట్, ఆర్కిటెక్ సంస్థలకు నిధుల సేకరణ, బ్యాంకు రుణాలు ఇప్పించడంలో అపార అనుభవం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నయాపైసా ఖర్చు చేయకున్నా ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేసే సత్తా వాటికుంది. అయితే తమకు అనుకున్న లాభాలు వస్తాయనే నమ్మకముంటే తప్ప వారు ఇందులో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. సర్కార్ మొదట్లో చెప్పినట్టు ఇండ్ల తొలగింపు ద్వారా రెండు వేల ఎకరాల భూమి అప్పగిస్తేనే అవి ముందడుగు వేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ముందు జాగ్రత్తగా రాష్ట్ర ప్రభుతం కొత్త కంపెనీల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు సమాచారం. ఇందు కోసం ప్రభుత్వంలోని ఓ ఉన్నతాధికారి తన శక్తి యుక్తుల్ని ధారపోస్తున్నట్టు తెలుస్తోంది.
నిధుల కోసం కేంద్రానికి విజ్ఞప్తులు
మూసీ ప్రాజెక్టుకు సాయమందించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఏడాది కాలంలో కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు మోడీ విచ్చేసిన సందర్భంలోనూ మూసీకి నిధులివ్వాలని కోరారు. ”గంగానది ప్రక్షాళన కోసం మోడీ ప్రభుత్వం రూ.40 వేల కోట్లు ఖర్చు చేసింది. సబర్మతి పునరుజ్జీవం కోసం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. కానీ తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవానికి నిధులివ్వకుండా పక్షపాతం చూపిస్తోంది” అని సీఎం పలుమార్లు కేంద్రంపై విమర్శలు గుప్పించారు. అయినా కేంద్రం నుంచి ఇప్పటి వరకు మూసీ ప్రాజెక్ట్ నిధుల కేటాయింపుపై ఎలాంటి హామీ లభించలేదు. ప్రాజెక్ట్ డీపీఆరే సిద్ధం కాని ప్రాజెక్ట్కు నిధులెలా ఇస్తారని మోడీ సర్కార్ అంటున్నట్టు సమాచారం.
ముందుకు కదలని ‘మూసీ’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES