– పేద విద్యార్థినికి విద్యారుణం
– మరోసారి మానవత్వం చాటుకున్న హరీశ్రావు
– సిద్దిపేటలోని బస్తీ దవాఖానను ఆకస్మిక సందర్శన
నవతెలంగాణ-సిద్దిపేట
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మరోసారి తన మానవతా ఔదార్యాన్ని చాటి చెప్పారు. ఆపదలో ఉన్నామంటే ఆగమేఘాల మీద స్పందించే ఆయన.. తాజాగా ఓ నిరుపేద వైద్య విద్యార్థిని భవిష్యత్తుకు చేయూత అందించారు. ఆ విద్యార్థినికి బ్యాంకు రుణం దక్కడానికి ఏకంగా తన సొంత ఇంటినే తనఖా పెట్టి పెద్దమనసు చాటుకు న్నారు. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేటకు చెందిన కొంక రామచంద్రం టైలరింగ్ వృత్తి చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన పెద్ద కుమార్తె మమత విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కళాశాలలో ఉచితంగా ఎంబీబీఎస్ సీటు సాధించి చదువు పూర్తిచేసింది. పీజీ ఎంట్రన్స్ పరీక్ష రాయగా మహ బూబ్నగర్లోని ఎస్వీఎస్ మెడికల్ కళాశాలలో ఆప్తమా లజీ విభాగంలో సీటు వచ్చింది. ప్రభుత్వ కన్వీనర్ కోటాలోనే సీటు వచ్చినప్పటికీ మూడేండ్ల పాటు ప్రతి ఏడాది రూ.7.50 లక్షల చొప్పున ట్యూషన్ ఫీజు చెల్లించాలి. అందుకు ఈనెల 18వ తేదీ చివరి గడువుగా ఉంది. ఆర్థిక స్తోమత లేని రామచంద్రం అంత డబ్బు చెల్లించలేక మనోవేద నకు గురయ్యాడు. బ్యాంకులో ఎడ్యుకేషన్ లోన్ కోసం ప్రయత్నించగా ఏవైనా ఆస్తులు మార్టిగేజ్ చేస్తేనే లోన్ ఇస్తామని బ్యాంకు అధికారులు సమాధానం ఇచ్చారు. తనకు ఎలాంటి స్థిరాస్తులు లేవని చెప్పడంతో ఆ దారి కూడా మూసుకు పోయింది. దాంతో గతంలో తన కూతుళ్లకు ఎంబీబీఎస్ సీట్లు వచ్చినప్పుడు హరీశ్రావు ఆర్థిక సాయం చేసిన విషయం గుర్తుకొచ్చి.. మళ్లీ ఆయనే ఆదుకుంటారని భావించి ఈ విషయాన్ని చేరవే శారు. వెంటనే స్పందించిన హరీశ్రావు.. సిద్దిపేట లోని తన ఇంటిని మార్టిగేజ్ చేసి మూడేండ్లకు సరిపడా దాదాపు రూ. 20 లక్షలు ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేయించారు. దాంతో ఆ డబ్బులను కళాశాలలో చెల్లించి సీటు దక్కించుకున్నారు. కాగా, మొదటి సంవత్సరం హాస్టల్కు లక్ష రూపాయలు అవుతుందని తెలుసుకున్న హరీశ్రావు.. మళ్ళీ హాస్టల్ ఫీజుకు ఎలాంటి అప్పు చేయొద్దని.. ఆ లక్ష రూపాయలు కూడా తానే చెల్లెస్తానని భరోసా ఇచ్చారు. కాగా, ఆటో కార్మికుల సంక్షేమానికి మూడేండ్ల క్రితం తన ఇంటిని మార్టిగేజ్ చేసి బ్యాంకు ద్వారా రుణం ఇప్పించారు. ఆ ఫలితంగానే ‘సిద్దిపేట ఆటో క్రెడిట్ కో – ఆపరేటివ్ సొసైటీ’ ఏర్పాటు చేశారు. దీనిద్వారా కార్మికులకు రుణాలు ఇస్తూ కొండంత భరోసాగా నిలిచింది.
బస్తీ దవాఖానాల్లో 6 నెలలుగా డాక్టర్లు లేరు : హరీశ్రావు
గత ప్రభుత్వంలో సిద్దిపేటలో 4చోట్ల బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసుకున్నామని, ఒక్క కేసీఆర్నగర్లోని బస్తీ దవాఖానలో మినహాయించి మిగతా మూడు దవాఖానల్లో 6 నెలల నుంచి డాక్టర్లు లేరని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట పట్టణంలోని ఆర్అండ్బీ గెస్ట్హౌస్ వద్దనున్న బస్తీ దవాఖానను శుక్రవారం హరీశ్రావు ఆకస్మికంగా సందర్శిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళ్లకుంట కాలనీ, లింగారెడ్డి పల్లి, ఆర్అండ్బీ కార్యాలయం సమీపంలోని దవాఖానల్లో డాక్టర్లు లేరని, డాక్టర్లు లేకుండా ప్రజలకు వైద్యం ఎలా అందిస్తారని ప్రశ్నించారు. అటెండర్కు మూడు నెలలుగా జీతం రావడం లేదని, స్టాఫ్నర్స్కూ నవంబర్ నెల జీతం ఇప్పటికీ ఇవ్వలేదని తెలిపారు. వెంటనే దవాఖానల్లో వైద్యులను నియమించి, మందులు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.
ఇల్లు తనఖా పెట్టి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



