నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు లేకపోవడమే కారణమన్న ఏడీఏ
లక్నో : అయోధ్యలోని ధనిపూర్ గ్రామంలో మసీదు నిర్మాణానికి అందచేసిన ప్లాన్ను అయోధ్య అభివృద్ధి సంస్థ (ఏడీఏ) తిరస్కరించింది. ప్రభుత్వ విభాగాల నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు ఏవీ అందకపోవడాన్ని కారణంగా పేర్కొంది. ఒక జర్నలిస్టు ఆర్టీఐ కింద ఈ నెల 16న అడిగిన ప్రశ్నకు సమాధానంగా అయోధ్య అభివృద్ధి సంస్థ పై జవాబు ఇచ్చింది. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, కాలుష్యం, పౌర విమానయానం, ఇరిగేషన్, రెవిన్యూ, మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా మేజిస్ట్రేట్, అగ్నిమాపక శాఖలతో సహా పలు ప్రభుత్వ విభాగాలేవీ కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు ఇవ్వలేదని పేర్కొంది. అలాగే దరఖాస్తు, స్క్రూటిని ఫీజులుగా మసీదు ట్రస్టు రూ.4,02,628 చెల్లించిందని పేర్కొంది. మసీదు ప్లాన్ తిరస్కరించడంపై మసీదు ట్రస్టు కార్యదర్శి అతర్హుస్సేన్ స్పందిస్తూ సుప్రీంకోర్టు చెప్పిన మేరకు యూపీ ప్రభుత్వం ఇచ్చిన భూమికి ప్రభుత్వ విభాగాలేవీ ఎందుకు నో అబ్జెక్షన్ ఇవ్వలేదో తనకు అర్ధం కావడం లేదని అన్నారు. 2019 నవంబరు 9న సుప్రీం కోర్టు అయోధ్య తీర్పును వెలువరించిన తర్వాత అయోధ్య జిల్లాలోని సోహావాల్ తహసిల్లో ధనిపూర్ గ్రామంలో రాష్ట్ర సున్ని సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు ఐదు ఎకరాల భూమిని కేటాయించింది. అయోధ్య పట్టణానికి 25కిలోమీటర్ల దూరంలో ఈ స్థలం వుంది. 2020 ఆగస్టు 3న జిల్లా మేజిస్ట్రేట్ అనుజ్ కుమార్ ఝా ఆ భూమిని సున్ని సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు బదలాయించారు. ఆ తర్వాత మసీదు ప్లాన్ ఆమోదం కోసం ఇతర సదుపాయాల కల్పన కోసం మసీదు ట్రస్టు 2021 జూన్ 23న ఎడిఎకు దరఖాస్తు చేసుకుంది. అయితే అప్పటినుంచి ఎలాంటి కార్యాచరణ జరగలేదు.