నవతెలంగాణ-హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో తల్లీకుమారుడు మృతిచెందిన ఘటన ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది. కుమారుడు అనారోగ్యానికి గురవడంతో మెరుగైన వైద్యం కోసం తల్లి, బంధువులు విశాఖపట్నం తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్రేయపురం మండలం వెలుచూరు గ్రామానికి చెందిన తోర్లపాటి తులసి (40)కి సంజయ్, శశికుమార్ (24) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. శశికుమార్కు క్యాన్సర్ వ్యాధి ఉంది. విశాఖపట్నంలోని ఆస్పత్రికి వెళ్లేందుకు తల్లితో పాటు ఇద్దరు కుమారులు, బంధువులు తోర్లపాటి పాపారావు, నాగబత్తుల శ్రీను కారులో బయల్దేరారు.
మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో గండేపల్లి శివారుకు వచ్చేసరికి ముందు వెళ్తున్న ట్రాలీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తులసి అక్కడికక్కడే మృతిచెందగా.. శశికుమార్ను రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మరణించాడు. మిగిలిన ముగ్గురికి తీవ్రగాయాలు కావడంతో వారికి రాజమహేంద్రవరం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శివనాగబాబు తెలిపారు.



