– కేరళలో యూడీఎఫ్ ఎంపీల పేలవ ప్రదర్శన
– బీజేపీ నేత, కేంద్ర మంత్రి సురేశ్ గోపీ ఖర్చు చేసింది ఆరు శాతమే
– అధికార లెఫ్ట్ ఎంపీలు భేష్
– అత్యధిక నిధులు విడుదల చేసిన ఎంపీగా సీపీఐ(ఎం) రాజ్యసభ సభ్యులు జాన్ బ్రిట్టాస్
తిరువనంతపురం : ఎంపీల్యాడ్స్ నిధుల వినియోగంలో కేరళలోని ప్రధాన ప్రతిపక్షం యూడీఎఫ్ ఎంపీలు, బీజేపీ నేత, కేంద్ర మంత్రి సురేశ్ గోపీ చాలా వెనుకబడ్డారు. అభివృద్ధి కోసం కనీస మొత్తంలోనూ నిధులు విదల్చటం లేదు. నిధుల ఖర్చు విషయంలో కేరళలో అధికార ఎల్డీఎఫ్ ఎంపీలు చక్కని ప్రదర్శనను కనబర్చారు. అధికారిక గణాంకాలు ఈ విషయాన్ని చెప్తున్నాయి. ఎంపీల్యాడ్స్ పథకం కింద ప్రతి ఎంపీకి ఏడాదికి రూ.5 కోట్లు స్థానిక అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేయడానికి హక్కు ఉంటుంది. అయితే కేరళకు చెందిన పలువురు ఎంపీలు మాత్రం ఈ నిధులను వినియోగించడంలో హౌరంగా విఫలమయ్యారని అధికారిక గణాంకాలను బట్టి తెలుస్తున్నది.
ఈ సమాచారం ప్రకారం.. యూడీఎఫ్ ఎంపీలు ఎం.కె రాఘవన్, ఈ.టి. మహహ్మద్ బషీర్ ఇప్పటి వరకు కేరళలో అభివృద్ధి పనుల కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. త్రిసూర్ ఎంపీ, కేంద్ర మంత్రి సురేశ్ గోపీ అందుబాటులో ఉన్న నిధుల్ల 5.97 శాతం మాత్రమే వినియోగించారు. భారీ ప్రచారంతో లోక్సభలోకి వచ్చిన షఫీ పరంబిల్ కూడా నాలుగు శాతమే ఖర్చు చేశారు. కేరళలో అత్యధిక నిధులు వినియోగిం చిన నేతగా సీపీఐ(ఎం) రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిట్టాస్ నిలిచారు. రాజ్యసభ ఎంపీలలో సీపీఐ(ఎం) నేత జాన్బ్రిట్టాస్ 26.32 శాతం నిధులను వినియోగించి ముందంజలో ఉన్నారు.
దేశవ్యాప్తంగా లోక్సభ ఎంపీల సగటు ఎంపీల్యాడ్స్ నిధుల వినియోగం 28.1 శాతం కాగా.. కేరళ లోక్సభ ఎంపీల సగటు 11.4 శాతమే ఉండటం రాష్ట్ర ఎంపీల పనితీరుపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. కేరళ లోక్సభ ఎంపీలలో అబ్దుస్సమద్ సమదాని 0.33 శాతం మాత్రమే నిధులు ఖర్చు చేశారు. కె. ఫ్రాన్సిస్ జార్జ్, షఫీ పరంబిల్ నాలుగు శాతం చొప్పున ఖర్చు చేశారు. ఇక శశిథరూర్ (13.28 శాతం), ప్రియాంక గాంధీ (13.37 శాతం), అదూర్ ప్రకాశ్ (14.25 శాతం), రాజమోహన్ ఉన్నిత్తన్ (14.32 శాతం)లు ఎంపీల్యాడ్స్ నుంచి కొంత మేర ఖర్చు చేశారు. మొత్తంగా చూస్తే… కేరళలో లెఫ్ట్ ఎంపీలు అభివృద్ధి నిధులను మెరుగ్గా వినియోగిస్తుండగా.. యూడీఎఫ్ ఎంపీలు, బీజేపీ ఎంపీలు ఇందులో వెనుకబడ్డారు.
ఎంపీల్యాడ్స్ నిధులు వినియోగిస్తలేరు
- Advertisement -
- Advertisement -



