రూ.9.32 లక్షల కోట్ల సంపదతో అగ్రస్థానం
తర్వాత స్థానంలో గౌతం అదానీ
ఫోర్బ్స్ జాబితా వెల్లడి
న్యూఢిల్లీ : దేశంలో అపారకుబేరుడిగా అగ్రస్థానంలో ముకేష్ అంబానీ కొనసాగుతున్నారు. భారత్లోని 100 మంది అత్యంత సంపన్నుల జాబితాను ఫోర్ట్బ్స్ విడుదల చేసింది. అంబానీ సంపద 105 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.9.32 లక్షల కోట్లు)గా ఉంది. కాగా.. గతేడాదితో పోలిస్తే 12 శాతం తగ్గింది. ఫోర్బ్స్ గురువారం విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం.. 2025లో 100 మంది భారత కుబేరుల సంపద విలువ లక్ష కోట్ల డాలర్ల (దాదాపు రూ.88 లక్షల కోట్లు)కు చేరింది. వీరి మొత్తం సంపద 2025లో 9 శాతం తగ్గింది. డాలర్తో రూపాయి మారకం విలువ పడిపోవడంతో కార్పొరేట్ల సంపదకు కోత పడింది.
ముకేష్ అంబానీ తర్వాత గౌతం అదానీ రెండో స్థానంలో నిలిచారు. అదానీ అదానీ 92 బిలియన్ డాలర్ల (రూ.8.17 లక్షల కోట్లు) సంపదను కలిగి ఉన్నారు. ఒపి జిందాల్ గ్రూపునకు చెందిన సావిత్రి జిందాల్ మూడో స్థానంలో ఉండగా, టెలికాం దిగ్గజం సునీల్ మిత్తల్ నాలుగు, టెక్ బిలియనీర్ శివ నాడార్ ఐదోస్థానంలో నిలిచారు. ఆయా సంస్థల షేర్ విలువలతో పాటు ఆయా వ్యక్తులు, కుటుంబాల నుంచి సేకరించిన ఆర్థిక సమాచారం, విశ్లేషకులు, స్టాక్ ఎక్స్ఛేంజీలు, నియంత్రణ సంస్థల నుంచి సేకరించిన వివరాలతో సంపద విలువను అంచనా వేసినట్లు ఫోర్బ్స్ వెల్లడించింది.
టాప్ 10 బిలినీయర్స్
పేరు సంపద (బి.డాలర్లలో)
ముకేష్ అంబానీ 105
గౌతం అదానీ 92
సావిత్రి జిందాల్ 40.2
సునీల్ మిట్టల్ 34.2
శివ్ నాడర్ 33.2
రాధాకిషన్ దమానీ 28.2
దిలీప్ షాంఘ్వీ 26.3
బజాజ్ కుటుంబం 21.8
సైరస్ పూనవల్లా 21.4
కుమార్ మంగళం బిర్లా 20.7