మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మెన్, వైస్ చైర్మెన్ ఎన్నికకు 50 శాతం కోరం ఉండాల్సిందే
ఫిబ్రవరి16న చేతులెత్తే పద్ధతిలో నిర్వహణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మున్సిపల్ పరోక్ష ఎన్నికలకు సంబంధించి సోమవారం తెలంగాణ ఎన్నికల సంఘం మార్గదర్శకాలు విడుదల చేసింది. తెలంగాణ మున్సిపల్ చట్టం 2019 ప్రకారం మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మెన్, వైస్ చైర్మెన్లను నేరుగా ఎన్నికైన సభ్యులతో పాటు ఎక్స్ అఫిషియో మెంబర్లైన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎన్నుకుంటారు. ఎక్స్ అఫిషియో సభ్యులు తాము ఓటు వేయాలనుకున్న కార్పొరేషన్, మున్సిపాల్టీలో తమ ఓటు హక్కును ఫిబ్రవరి 11 నుంచి14 వరకు సంబంధిత కలెక్టర్ నియమించిన అధికారి ప్రత్యేక సమావేశం కోసం నోటిఫికేషన్ విడుదల చేసే వరకు నమోదు చేసుకోవచ్చు.
ఫిబ్రవరి 16న ఎన్నికైన సభ్యులతో సంబంధిత ఎన్నికల అధికారి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అదే రోజు చేతులెత్తే పద్ధతిలో కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మెన్, వైస్ చైర్మెన్లను ఎన్నుకుంటారు ఎన్నికైన సభ్యుల్లో 50 శాతాన్ని కోరంగా పరిగణిస్తారు. అంతకన్నా తక్కువ మంది హాజరైనా, మరే ఇతర కారణాల చేత సమావేశం వాయిదా పడినా..ఆ ఎన్నికను తదుపరి రోజు నిర్వహిస్తారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నుంచి ఎన్నికైన అభ్యర్థులు విప్ ఆదేశాలను పాటించకుంటే ఆయా పార్టీలు తీసుకునే చర్యలకు బాధ్యులవుతారు.
ఎక్స్ అఫిషియో సభ్యుల ఓటు నమోదు చేయండి
జిల్లా కలెక్టర్లకు ఎన్నికల సంఘం ఆదేశం
మున్సిపల్ పరోక్ష ఎన్నికల్లో పాల్గొనే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఓటు హక్కు నమోదు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు ఆమె సోమవారం హైదరాబాద్ నుంచి జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫిబ్రవరి 16న మున్సిపల్ పరోక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 11 నుంచి 14 వరకు అవకాశం కల్పించాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో తెలంగాణ ఎన్నికల సంఘం కార్యదర్శి లింగ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.



