నవతెలంగాణ – కామారెడ్డి
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళి, భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. కామారెడ్డి పట్టణంలోని డ్రైవర్స్ కాలనీ, హరిజనవాడ, గొల్లవాడ, జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాల, ఎంపీపీ ఎస్ ఆర్బీ నగర్, జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ దేవునిపల్లి, ఎన్జీవోఎస్ కాలనీ ఎంపీపీ ఎస్ పాఠశాల కాలనీ, లింగాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పంచముఖి హనుమాన్ యం యు పి ఎస్ వంటి కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు.
జిల్లా కలెక్టర్తో కలిసి ఎల్లారెడ్డి, బాన్సువాడలోని పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ సెంటర్లను తనిఖీ చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో బి ఎన్ ఎస్ ఎస్ సెక్షన్ 163 (పాత 144 సెక్షన్) అమలులో ఉండగా, ఐదుగురికి పైగా గుంపులుగా చేరడం నిషేధించబడింది. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రత్యేక పోలీసు నిఘా కొనసాగుతుందని చెప్పారు. పోలీస్ సిబ్బంది ఓటర్లతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ విధులను సమర్థంగా నిర్వహించాలని ఎస్పీ సూచించారు. చట్ట ఉల్లంఘనలు, బెదిరింపులు, ప్రలోభాలు లేదా గందరగోళం సృష్టించే ప్రయత్నాలకు ఎలాంటి తావు ఉండదని, అవసరమైతే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్లు భయభ్రాంతులకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, పోలీస్ శాఖ పూర్తి స్థాయి భద్రతను కల్పిస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. ప్రజలు పోలీస్ శాఖకు సహకరిస్తూ ప్రజాస్వామ్య పండుగను ప్రశాంతంగా, గౌరవప్రదంగా ముగించేందుకు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి అడ్మిన్ కె. నర్సింహారెడ్డి, ఏ ఎస్ పి బి. చైతన్య రెడ్డి, పట్టణ సీఐ నరహరి, రూరల్ సీఐ రామన్, ఎల్లారెడ్డి డీఎస్పీ వైఎస్ శ్రీనివాసరావు, ఎస్హెచ్ఓ మహేష్, బాన్సువాడ ఎస్హెచ్ఓ శ్రీధర్, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.



