నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణలో కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ ఛైర్పర్సన్ల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయించనున్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఎస్టీ (జనరల్)కి కేటాయించారు. రామగుండం- ఎస్సీ (జనరల్), మహబూబ్నగర్- బీసీ (మహిళ), మంచిర్యాల- బీసీ (జనరల్), కరీంనగర్- బీసీ (జనరల్)కు కేటాయించారు. 121 మున్సిపాలిటీల్లో 5 ఎస్టీ, 17 ఎస్సీ, 38 బీసీలకు కేటాయించారు. మున్సిపల్ ఎన్నికలపై ఆదివారం కేబినెట్లో తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమంటూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం నివేదిక ఇవ్వనుంది. ఈ నెల 20వ తేదీ నుంచి ఎప్పుడైనా పురపోరుకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.
మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం రెడీ …
రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా మున్సిపల్ ఎన్నికలకు శరవేగంగా సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లోని ఆరు కార్పొరేషన్లు, 366 డివిజన్లు, 117 మున్సిపాల్టీలు, 2 వేల 630 వార్డుల్లో తుది ఓటర్ల జాబితాలను ప్రచురించారు. వీటన్నింటిలో కలిపి పురుష ఓటర్లు 25,62,369 ఉండగా, మహిళలు 26,80,14 మంది, థర్డ్ జెండర్లు 640 ఓటర్లు ఉన్నట్లు ఎస్ఈసీ వెల్లడించింది. ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 8,195 పోలింగ్ కేంద్రాలను ఖరారు చేసింది. పోలింగ్ కేంద్రాల వారీగా ఫొటోలతో కూడిన ఓటరు జాబితాలను శుక్రవారం ప్రచురించింది.



