Monday, June 9, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమున్నేరు టూ పాలేరు

మున్నేరు టూ పాలేరు

- Advertisement -

గ్రావిటీ కెనాల్‌కు నేటితో టెండర్లు పూర్తి
మంత్రి పొంగులేటి కృషితో రూ.162.54 కోట్లు కేటాయింపు
ఖమ్మం, మహబూబాబాద్‌, సూర్యాపేట జిల్లాల్లో 2 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు స్థిరీకరణ
మున్నేరు వరదను కొంతమేర నియంత్రించనున్న కెనాల్‌
మూడు జిల్లాల్లో తీరనున్న తాగు, సాగునీటి అవసరాలు
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి

సముద్రం పాలవుతున్న మున్నేరు వరద నీటిని పాలేరు జలాశయానికి మళ్లిస్తే ఖమ్మం జిల్లాలో సాగర్‌ ఆయకట్టుకు సమృద్ధిగా నీరందించొచ్చనే లక్ష్యంతో ప్రతిపాదించిన ‘మున్నేరు-పాలేరు’ వరద కాల్వ తవ్వకానికి టెండర్ల దాఖలు గడువు సోమవారంతో ముగియనుంది. రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచారశాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక కృషితో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి పరిపాలన అనుమతులు మంజూరు చేశారు. మున్నేరు వరదను కూడా ఇది 10 వేల క్యూసెక్కుల వరకు తగ్గిస్తుంది.
రూ.162.54 కోట్లతో నిర్మాణం..
ఈ నిర్మాణానికి రూ.162.54 కోట్ల నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం నుంచి గత నెలలో ఆదేశాలు జారీ అయ్యాయి. ఇది పూర్తయితే భారీ ఖర్చు లేకుండా గ్రావిటీ కెనాల్‌ ద్వారా నీటిని మళ్లించొచ్చు. ప్రభుత్వం చేపట్టే లింక్‌ కాలువ నిర్మాణంతో దాదాపు 10 టీఎంసీల మున్నేరు నీళ్లను మళ్లిస్తారు. మున్నేరు నుంచి సీతారామ ఎత్తిపోతల ప్రధాన కాలువకు అనుసంధానిస్తూ లింక్‌ కాలువ తవ్వడం ద్వారా పాలేరుకు నీళ్లు చేరతాయి. పాలేరు జలాశయం పరిధిలో 2.54 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. పాలేరు నియోజకవర్గంలోనే 1.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. సూర్యాపేట, మహబూబాబాద్‌, ఖమ్మం జిల్లాలకు తాగునీరు ఇవ్వడంతోపాటు డోర్నకల్‌ నియోజకవర్గ పరిధిలో పది చెరువులను నింపొచ్చు.
సీతారామ కాల్వకు లింక్‌ కెనాల్‌ అనుసంధానం
గోదావరి జలాలను పాలేరు జలాశయానికి తరలించే క్రమంలో ఏన్కూరు ప్రాంతం నుంచి పాలేరు లింక్‌ కెనాల్‌తో అనుసంధానిస్తారు. ఈ కాల్వ పాలేరు జలాశయం వరకు 74 కి.మీ. ఉండగా, గార్ల మండలంలోని పుల్లూరు సమీపంలో 37వ కి.మీ. వద్ద మున్నేరు వరద కాల్వను అనుసంధానించాలనేది ప్రతిపాదన. ఇదే మండలంలోని మద్దివంచ ప్రాంతంలోని చెక్‌ డ్యాం నుంచి 9.5 కి.మీ. వరద కాల్వ తవ్వి ఇక్కడ అనుసంధానిస్తారు. దాంతో మున్నేరు వరద నుంచి కనీసం 6-10 వేల క్యూసెక్కుల నీటిని మళ్లించే అవకాశాన్ని అధికారులు అంచనా వేశారు. మున్నేరు నుంచి వరద కాల్వ ప్రారంభమయ్యే మద్దివంచ ప్రాంతం నుంచి వరద మళ్లింపు కాల్వ లింక్‌ కెనాల్లో కలిపే పుల్లూరు ప్రాంతం నాలుగు మీటర్ల లోతట్టుగా ఉండటంతో వరద నీరు గ్రావిటీ ద్వారానే పాలేరు లింక్‌ కెనాల్‌కు చేరనుంది. మున్నేరు ఏటా కనీసం 30 నుంచి 45 రోజులపాటు పూర్తిస్థాయిలో ప్రవహిస్తుందనే అంచనా ఉండగా, ఈ సమయంలో వరద నీటిని పాలేరుకు మళ్లిస్తే కనీసం 20 టీఎంసీల నీటిని నిల్వ చేయొచ్చని అంచనా వేశారు. కాల్వ తవ్వకానికి ప్రభుత్వ భూములతోపాటు, సుమారు 200 ఎకరాలు సేకరించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన డీపీఆర్‌ను సీఈ విద్యాసాగర్‌, ఎస్‌ఈ మంగళంపూడి వెంకటేశ్వర్లు, డీఈఈ బానాల రమేష్‌ రెడ్డి రూపొందించారు.
ప్రణాళిక ఇలా..
మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం దుబ్బగూడెం చెక్‌ డ్యామ్‌ నుండి 10 టీఎంసీల నీటిని గ్రావిటీ ఎఫ్‌ బీడబ్ల్యూ ద్వారా పాలేరు లింక్‌ కెనాల్‌కు మళ్లించడం ద్వారా నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ ఆయకట్టు స్థిరీకరించడంతో పాటు తాగునీటి అవసరాలు తీరుతాయి. 4500 క్యూసెక్కులు ఈ కెనాల్‌ ద్వారా విడుదలవుతాయి. మున్నేరు నది బెడ్‌ లెవల్‌ 145.700 మీటర్లు.. దీనిని పాలేరు లింక్‌ కెనాల్‌తో 37.400 వద్ద అనుసంధానించే దుబ్బగూడెం చెక్‌డ్యామ్‌ మధ్య దూరం 9.650 కి.మీ. నిర్ధారించారు. రైల్వే క్రాసింగ్‌కు ముందు గార్ల మండలం బుద్దారం గ్రామం సమీపంలో కి.మీ. 37.400 వద్ద ఉన్న పాలేరు లింక్‌ కెనాల్‌ సీబీఎల్‌ ం142.00 మీటర్లు (రైల్వే క్రాసింగ్‌ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి). మున్నేరు నది బెడ్‌ నుంచి కి.మీ. 37.400 వద్ద ఉన్న పాలేరు కెనాల్‌ సీబీఎల్‌ ఎత్తు వ్యత్యాసం 3.700 మీటర్లు. ట్యాపింగ్‌ పాయింట్‌ వద్ద 14 టీఎంసీల నీరు ఉండేలా ప్రణాళిక రూపొందించారు. గోదావరి నదిని పాలేరు రిజర్వాయర్‌తో అనుసంధానించే కాలువ మొత్తం పొడవు సుమారు 188.974 కిమీలుగా అధికారులు నిర్ధారించారు.
గ్రావిటీ కెనాల్‌తో ప్రయోజనాలు
పాలేరు జలాశయం నుంచి 359 గ్రామాలు, ఖమ్మం మునిసిపల్‌ కార్పొరేషన్‌తో పాటు 1686 గ్రామాలు, మహబూబాబాద్‌ జిల్లాలోని 5 మునిసిపాలిటీలు, సూర్యాపేట జిల్లాలోని 389 గ్రామాలు, సూర్యాపేట మునిసిపాలిటీ (పాక్షికంగా) తాగునీటి అవసరాలు తీర్చవచ్చు. తాగునీటి కోసం సంవత్సరానికి 4.70 టీఎంసీలను ప్రాజెక్టులో భాగంగా కేటాయించారు. పాలేరు జలాశయం నుంచి ఎస్‌ఆర్‌ఎస్పీ స్టేజ్‌ -2 వరకు ఖరీఫ్‌ కోసం భక్త రామదాసు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకం కింద 5.50 టీఎంసీలను కేటాయించారు. కేటాయించిన నీటిని మున్నేరు నుంచి గ్రావిటీ కెనాల్‌ ద్వారా ఉపయోగించుకుంటారు. సూర్యాపేట జిల్లాలో 40 వేల ఎకరాల ఆయకట్టు కెనాల్‌ ద్వారా స్థిరీకరించొచ్చు. ఖమ్మం జిల్లాలో 2.5 లక్షల ఎకరాల ఎన్‌ఎస్పీ ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు పాలేరు రిజర్వాయర్‌ హైడల్‌ విద్యుత్‌ ప్రాజెక్టులో రెండు మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయొచ్చు.న

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -