Thursday, June 26, 2025
E-PAPER
Homeక్రైమ్తమ ప్రేమకు తల్లి అడ్డు వస్తుందనే హత్య..

తమ ప్రేమకు తల్లి అడ్డు వస్తుందనే హత్య..

- Advertisement -

జీడిమెట్ల మహిళ హత్యకేసు వివరాలు వెల్లడించిన డీసీపీ
ముగ్గురు నిందితులకు రిమాండ్‌
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట

తల్లి తమ ప్రేమకు అడ్డు వస్తోందనే కుమార్తె తన ప్రియుడితో కలిసి ఆమెను హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో హత్యకు గురైన అంజలి కేసులో కుమార్తెతోపాటు సహకరించిన ప్రేమికుడిని, అతని తమ్మున్ని పోలీసులు అరెస్టు చేశారు. వారిని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం షాపూర్‌నగర్‌లోని బాలానగర్‌ జోన్‌ డీసీపీ కార్యాలయంలో డీసీపీ కె.సురేష్‌కుమార్‌, అదనపు కమిషనర్‌ సత్యనారాయణ, ఏసీపీ పి.నరేష్‌రెడ్డి, సీఐ గడ్డం మల్లేష్‌తో కలిసి విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
న్యూ లాల్‌ బహుదూర్‌నగర్‌లో నివసించే అంజలి తెలంగాణ సాంస్కృతిక సారధి కళాబృందంలో కొన్నేండ్లుగా కళాకారిణిగా పని చేసింది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. 10వ తరగతి చదువుతున్న 16 ఏండ్ల పెద్ద కుమార్తెకు కొద్ది నెలల కిందట ఇన్‌స్టాగ్రామ్‌లో నల్లగొండ జిల్లా కట్టంగూర్‌ మండల కేంద్రానికి చెందిన శివతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. విషయం తెలుసుకున్న తల్లి అంజలి.. ఉన్నత చదువులు చదవాలని, ఇది ప్రేమించే వయసు కాదని బాలికను మందలించింది. ఈ క్రమంలో జూన్‌ 19న బాలిక ఇంటి నుంచి వెళ్లిపోవడంతో తల్లి జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌లో మిస్సింగ్‌, కిడ్నాప్‌ కేసు పెట్టింది. దాంతో బాలిక 21న రాత్రి ఇంటికి తిరిగొచ్చింది. అయితే, తల్లి తమ ప్రేమకు అడ్డు వస్తోందని, ఆమెను అంతమొందించాలని బాలిక పక్కా పథకం వేసి ప్రియుడికి చెప్పింది. అందుకు అతను ముందుగా నిరాకరించాడు. ‘నువ్వు నా మాట వినకపోతే నీ పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటా..’ అని బాలిక బెదిరించడంతో అతను హత్య చేయడానికి ఒప్పుకున్నాడు. ఈ నెల 23న శివ అతని సోదరుడితో(బాలుడు) కలిసి బైక్‌పై షాపూర్‌నగర్‌లోని ఎన్‌ఎల్‌బి నగర్‌కు వచ్చారు. ఆ సమయంలో ఇంట్లో తన చెల్లెలు కూడా ఉండటంతో నిందితురాలు ఆమెకు మాయమాటలు చెప్పి బయటికి పంపించింది. ఆ తర్వాత శివ, అతని సోదరుడికి ఫోన్‌ చేసి పిలిపించింది. ఇంట్లో కుర్చీలో కూర్చున్న అంజలిని శివ తోయడంతో ముందుకు పడిపోవడంతో ఆమె మెడకు కుమార్తె ఊపిరాడకుండా చున్నీ గట్టిగా బిగించింది. శివ, అతని సోదరుడు కాళ్లు చేతులు గట్టిగా అదిమి పట్టుకున్నారు. ఈ పెనుగులాటలో అంజలికి చిన్న చిన్న గాయాలై స్పృహ కోల్పోవడంతో చనిపోయిందనుకుని అన్నదమ్ములు వెళ్లిపోయారు.
ఆ తర్వాత అంజలి చిన్న కూతురు ఇంటికి వచ్చేసరికి ”మమ్మీ ఇంట్లోకి రావద్దన్నది.. బయటనే కూర్చోమన్నది” అని నిందితురాలు చెప్పడంతో ఆమె బయట కూర్చుంది. కొద్దిసేపటి తర్వాత ఆకలవుతుందని చిన్న కుమార్తె లోపలికి వెళ్లగా తల్లి వంటింట్లో రక్తమడుగులో ఉండటాన్ని చూసింది. 108కు ఫోన్‌ చేయాలని, బయట ఎవరినైనా పిలవాలని అక్కకు చెప్పితే.. ఎవరిని పిలువాలో నేను పిలుస్తాను వారు వచ్చి కాపాడతారని నమ్మబలికి మళ్లీ శివకు ఫోన్‌ చేసింది. మమ్మీ ఇంకా చనిపోలేదని, వచ్చి చంపాలంది. దీంతో వారు అక్కడికి చేరుకొని అంజలి చిన్న కూతురును ఎవరైనా తెలిసిన ఆంటీ ఉంటే పిలుచుకురమ్మని బయటికి పంపించారు.
ఈ క్రమంలో కాపాడుతున్నట్టు నటించి అంజలి ముఖంపై నీళ్లు చల్లారు. ఆమెలో కదలిక రావడంతో మళ్లీ చున్నిని మెడకు గట్టిగా బిగించి చంపేశారు. తర్వాత ఇద్దరు అన్నదమ్ములు పారిపోయారు. రాత్రి 11:30 సమయంలో తల్లి చనిపోయిన విషయాన్ని శివకు మెసేజ్‌ ద్వారా తెలిపింది నిందితురాలు. అలాగే, తన తల్లి ప్రమాదవశాత్తు కింద పడిపోయిందని ఇరుగుపొరుగు వారికి చెప్పింది. రాత్రి 11:40 గంటల సమయంలో 100కు డయల్‌ చేయడంతోపాటు, జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందించడంతో సీఐ గడ్డం మల్లేష్‌ సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకున్నారు. అర్ధరాత్రి రెండు బృందాలను నల్లగొండ జిల్లా కట్టంగూర్‌ గ్రామానికి పంపించి శివను అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని సంతోష్‌ నగర్‌లో అతని సోదరున్ని, సదరు బాలికను అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. అంజలిని తామే హత్య చేసినట్టు ఒప్పుకున్నారని డీసీపీ తెలిపారు. నిందితులను 24 గంటల వ్యవధిలో పట్టుకున్న పోలీసు బృందాలను ప్రత్యేకంగా అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -