ముస్లింల అభివృద్ధికి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది
బాల్కొండ ‘షాదీఖానా’ నిధుల నిలుపుదలపై ఎమ్మెల్యే వేముల తీవ్ర ఆగ్రహం
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందే వరకు పోరాడుతాం
మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
నవతెలంగాణ – బాల్కొండ
బాల్కొండ మండల కేంద్రంలో ఆదివారం ముస్లీమ్ మైనారిటీ సోదరులతో కలిసి నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపి వారితో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పాలన – సంక్షేమ స్వర్ణయుగం గత పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిజమైన లౌకికవాదంతో ముస్లిం మైనారిటీల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ముస్లింలలో ఉన్న పేదరికాన్ని తొలగించేందుకు రెసిడెన్షియల్ పాఠశాలలు, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ వంటి అనేక వినూత్న పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అటకెక్కించిందని వేముల విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ సరిగ్గా లేదని, ప్రజలకు అందుతున్న అనేక పథకాలు ఇప్పుడు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. షాదీఖానా నిధులపై నిలదీశారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో బాల్కొండలో షాదీఖానా నిర్మాణం కోసం సెక్రటేరియట్ నుండి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుమతితో సుమారు 30 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించానని తెలిపారు.
అయితే ప్రస్తుత ప్రభుత్వం ఆ నిధులను నిలిపివేయడం లేదా క్యాన్సిల్ చేయడం దురదృష్టకరమని మండిపడ్డారు. ప్రభుత్వాలు మారినా పాత జీవోలను, అభివృద్ధి పనులను కొనసాగించాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉందన్నారు.గతంలో మంజూరైన అభివృద్ధి పనులను ఎందుకు నిలిపివేస్తున్నారని కాంగ్రెస్ నాయకులను, ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆయన ముస్లిం సోదరులకు సూచించారు. బాల్కొండ షాదీఖానా నిర్మాణం కోసం తాను వ్యక్తిగతంగా పోరాడతానని, నిధులు వచ్చే వరకు విశ్రమించబోనని ఆయన భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ముస్లిం పెద్దలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.



