– ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
నవతెలంగాణ – అశ్వారావుపేట
వచ్చే పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సూచించారు. ఆదివారం మండలంలోని అనంతారం,పెద్దవాగు ప్రాజెక్టు గిరిజన ఆశ్రమ బాల బాలికల ఆశ్రమ పాఠశాలలను అశ్వారావుపేట మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్ జూపల్లి రమేష్ బాబు తో సహా ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా పాఠశాలల్లో విద్యార్థుల విద్యా సామర్థ్యం,వసతి సదుపాయాలను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. వారి అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకున్నారు.
త్వరలో జరగనున్న పదవ తరగతి పరీక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రతి విద్యార్థిపై ఉపాధ్యాయులు వ్యక్తిగత దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే సూచించారు.ముఖ్యంగా చదువులో వెనుకబడిన విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహించి, ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలని ప్రధానోపాధ్యాయురాళ్ళు సుశీల, సరోజిని లకు సూచించారు.
గిరిజన ప్రాంతాల విద్యార్థులు కూడా ఉన్నత విద్యను అభ్యసించి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆయన ఆకాంక్షించారు. విద్యార్థుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని పేర్కొన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.



