శ్రీశైలం నుంచి భారీగా వరద నీరు
585 అడుగులకు చేరుకున్న నీటిమట్టం
నేడు తెరుచుకోనున్న డ్యాం గేట్లు
నవతెలంగాణ-నాగార్జునసాగర్
శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్కు పెద్దఎత్తున వరద నీరు వస్తుండటంతో జలాశయం నిండుకుండలా ఉంది. ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరుతోంది. అంతేమేర దిగువన సాగర్కు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను సోమవారం రాత్రికి 585 అడుగుల వరకు నీరు చేరింది. మంగళవారానికి 586 అడుగులు దాటనుంది. మంగళవారం ఉదయం సాగర్ డ్యామ్ గేట్లను ఎత్తనున్నారు. కుడి కాలువ ద్వారా 5394 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 6634 క్యూసెక్కులు, ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 28,785 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీ ద్వారా 1800 క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మంగళవారం ఉదయం సాగర్ డ్యాం గేట్లను ఎత్తనుండటంతో పర్యాటకుల సంఖ్య పెరగనుంది. శ్రీశైలం జలాశయానికి జూరాల, సుంకేశుల నుంచి 2,42,724 క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో 1,47,195 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం డ్యాం స్పిల్వే ద్వారా నాలుగు గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తి 1,08260 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 20 వేల క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 31,581 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882.80 అడుగుల వద్ద ఉన్నది.
నిండుకుండలా నాగార్జునసాగర్ ప్రాజెక్టు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES