నవతెలంగాణ-హైదరాబాద్: చట్టసభలల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెచ్చిన ‘నారీ శక్తి వందన్ అధియాన్’ను అమలు చేసేందుకు తీసుకున్న నిర్ణయం 21వ శతాబ్దపు భారత్ తీసుకున్న అతిపెద్ద నిర్ణయాలలో ఒకటని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. నేడు న్యూఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో జరిగిన ‘నారీ శక్తి వందన్ సమ్మేళన్’లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. దేశ అభివృద్ధి ప్రస్థానంలో ఈ కీలక ఘట్టాల నడుమ భారతదేశం 21వ శతాబ్దపు అతిపెద్ద నిర్ణయాలలో ఒకదాన్ని తీసుకోబోతోంది. 21వ శతాబ్దపు ముఖ్యమైన నిర్ణయాలలో ఇది కూడా ఒక ముఖ్యమైన నిర్ణయం అని చెబుతున్నాను. ఈ నిర్ణయం నారీశక్తికి అంకితం చేయబడింది. గత దార్శనికతను వాస్తవ రూపంలోకి తీసుకొచ్చే, అలాగే సామాజిక న్యాయం, పరిపాలన, నిర్ణయాలలో కీలక భాగంగా మార్చే ఒక చర్యగా ప్రధాని మోడీ దీనిని అభివర్ణించారు. ఈ నిర్ణయం మహిళా శక్తికి, మహిళా శక్తి గౌరవానికి అంకితం చేయబడింది.
మన దేశ పార్లమెంటు ఒక కొత్త చరిత్రను సృష్టించేందుకు దగ్గరలో ఉంది. గత భావనలను సాకారం చేసే ఒక కొత్త చరిత్ర అది. భవిష్యత్తు తీర్మానాలను నెరవేర్చేది. ఇది సమానత్వంతో కూడిన భారతదేశం కోసం ఒక తీర్మానం. ఇక్కడ సామాజిక న్యాయం కేవలం ఒక నినాదంగా కాకుండా మన పని సంస్కృతిలో, మన నిర్ణయ ప్రక్రియలో ఒక సహజ భాగంగా ఉంటుంది. రాష్ట్ర శాసనసభల నుండి దేశ పార్లమెంటు వరకు దశాబ్దాల నిరీక్షణకు తెరదించే సమయం ఆసన్నమైంది. అది ఏప్రిల్ 16,17,18 తేదీలు. ప్రజాస్వామ్య వ్యవస్థలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలనే ఆవశ్యకతను దశాబ్దాలుగా ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. ఈ చర్చ దాదాపు నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతుంది. ఇందులో అన్ని పార్టీల, అనేక తరాల కృషి ఉంది. ప్రతి పార్టీ ఈ ఆలోచనను తనదైన రీతిలో ముందుకు తీసుకెళ్లింది. 2029 నాటికి మహిళా సాధికారత చట్టాన్ని అమలు చేయాలన్నది ఏకగ్రీవ డిమాండ్.
ఈ అంశంపై ఏప్రిల్ 16 నుంచి పార్లమెంటు సమగ్ర చర్చలు జరుపుతుంది. దీన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అన్ని పార్టీలు కలిసి పనిచేస్తాయి’ అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి పార్టీ రాజకీయాలకు అతీతంగా మహిళల ప్రయోజనం కోసం ఈ ముఖ్యమైన పనిని చేపట్టినందుకు దేశంలోని ప్రతి మహిళ కూడా సంతోషిస్తుంది అని మోడీ అన్నారు.



