నవతెలంగాణ – తుంగతుర్తి
జాతీయ నాయకుల విగ్రహాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉందని స్థానిక సర్పంచ్ మల్లెపాక సాయి బాబా అన్నారు. ఆదివారం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా మండల కేంద్రంలోని జగ్జీవన్ రామ్ విగ్రహం చుట్టూ, గ్రామపంచాయతీ సిబ్బందితో కలిసి పరిశుభ్రం చేసి మాట్లాడారు. దేశ స్వాతంత్ర్యం, ఐక్యత, అభివృద్ధి కోసం తమ ప్రాణాలను, జీవితాలను త్యాగం చేసిన జాతీయ నాయకులను స్మరించుకోవడం మన బాధ్యత అన్నారు.
వారి పోరాటాలు, త్యాగాలు, ఆదర్శాలు నేటి యువతకు స్ఫూర్తినిస్తాయని అన్నారు. ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధుల అచంచలమైన సంకల్పం వల్లనే నేడు మనం స్వేచ్చా వాయువులు పీల్చుకుంటున్నామని, వారి జయంతి వర్ధంతి సందర్భాలలో మాత్రమే కాకుండా వారి ఆశయాలను నిత్యజీవితంలో పాటిస్తూ ప్రజాస్వామ్య విలువలను కాపాడటం మన కర్తవ్యం అన్నారు.



