“సమ్మె” ను జయప్రదం చేద్దాం
కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్సు రద్దు చేయాలి. 29 కార్మిక చట్టాలను పునరుద్దరించాలి
ఐసిడిఎన్ ప్రైవేటీకరణ ఆపాలి
అంగన్వాడీ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొందాం.!
తెలంగాణ అంగన్ వాడీ టీచర్స్ & హెల్చర్స్ యూనియన్ (సిఐటియు)
సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్
నవతెలంగాణ – కంఠేశ్వర్ : 2025 జులై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేద్దామని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం సిఐటియు కార్యాలయంలో అంగన్వాడీ జిల్లా విస్తృత సమావేశం జరిగింది. ఐ సి డి ఎస్ కార్యాలయంలో పిడి కి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శ నూర్జహాన్ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ రమేష్ బాబులు మాట్లాడుతూ..కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను వేగవంతంగా అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తెచ్చింది. ఇవి అమల్లోకి వస్తే భారత కార్మికవర్గం త్యాగాలతో సాధించుకున్న హక్కులన్నీ హరించబడతాయి. అంగన్వాడీ ఉద్యోగులు ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి బ్రతకాల్సిన స్థితి వస్తుంది. అంగన్వాడీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఏ ఒక్క సమస్యను నేటికీ కేంద్ర ప్రభుత్వం పరిష్కారం చేయడం లేదు.
ఈ నేపథ్యంలో కేంద్ర కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా 2025 జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెలో సిఐటియు అనుబంధ సంఘం అయిన తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) భాగస్వామ్యం అవుతున్నది. కావున ఐసిడిఎస్ లో పనిచేస్తున్న అంగన్వాడీ ఉద్యోగులందరూ ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిస్తున్నాం.లేబర్ కోడ్స్ అమలుకు వ్యతిరేకంగా 2025 మే 20 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కార్మికవర్గం సన్నద్ధమవుతున్న సందర్భంలో పహల్గామ్లో ఉగ్రవాదుల దాడులు జరిగాయి. భారత్, పాకిస్తాన్ రెండు పొరుగు దేశాల మధ్య వైమానిక దాడులు వల్ల ఉద్రిక్తతలు పెరగడంతో మే 20న జరగాల్సిన సార్వత్రిక సమ్మెను 2025 జూలై 9కి వాయిదా వేయాల్సి వచ్చింది. కానీ బిజెపి నేతృత్వంలోని ఎన్డీఎ ప్రభుత్వం ఈ పరిస్థితుల్లో కూడా అత్యంత దారుణంగా లేబర్ కోడ్ల అమలును ముందుకు తీసుకెళ్ళింది.ప్రమాదకరమైన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి: స్వాతంత్రానికి ముందు తర్వాత కాలంలో కార్మికవర్గం పోరాడి సాధించుకున్న చట్టాల్లో 29 చట్టాలను రద్దు చేసి వేతనాల కోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్, సామాజిక భద్రతా కోడ్లుగా రూపొందించారు. ఇందులో కనీస వేతనం నిర్ణయాన్ని ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలకు వదిలేశారు.
కనీస వేతనం రోజుకు రూ.176/-లు నెలకు రూ.4,576/-లుగా నిర్ణయం చేశారు. అట్లాగే 8 గంటల పని దినాన్ని 12 గంటలుగా నిర్ణయించారు. కార్మిక సంఘాల రిజిస్ట్రేషన్, సమ్మె హక్కును నిర్వీర్యం చేశారు. ఇప్పటికే ఉన్న సంఘాల రద్దు కోసం అనేక షరతులు పెట్టారు. ఉమ్మడి బేరసారాల హక్కును తొలగించారు. పని ప్రదేశాల్లో కరపత్రాల పంపిణీ, మీటింగ్లపై ఆంక్షలు విధిస్తున్నారు. చట్టాలు అమలు చేయని యాజమాన్యాలకు శిక్షలు తగ్గించారు. కార్మికులు న్యాయం కోసం ప్రశ్నిస్తే అరెస్ట్ చేసి బిఎన్ఎస్ చట్టం క్రింద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైళ్ళలో నిర్బంధిస్తున్నారు. వీటితో పాటు ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ,తదితర అనేక కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నారు. వీటివల్ల ఇతర రంగాల కార్మికులతో పాటు అంగన్వాడీ ఉద్యోగులకు కూడా భద్రత లేని పరిస్థితి ఏర్పడుతున్నది. కాబట్టి ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేసి 29 కార్మిక చట్టాలను పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షురాలు దేవగంగు కార్యదర్శి పి స్వర్ణ కోశాధికారి చంద్రకళ ఉపాధ్యక్షులు మంగమ్మ, సహాయ కార్యదర్శి శివ రాజమ్మ, జిల్లా ఉపాధ్యక్షులు సూర్య కళ ప్రాజెక్ట్ వారిగా అంగన్వాడి నాయకులు పాల్గొన్నారు.