Monday, June 30, 2025
E-PAPER
Homeదర్వాజప్రకృతి ప్రేమికుడు

ప్రకృతి ప్రేమికుడు

- Advertisement -


”ఆ తర్వాత” కవి/ చెట్టు/ ఆకురాల్చో పూవురాల్చో/ చివరకు పండురాల్చో/ మట్టి రుణం తీర్చుకుంటుంది (ఆ తర్వాత : పు. 238)
మానవజాతి మనుగడకు ఆధారమైన ప్రకృతి ప్రపంచ సాహిత్యమంతా పచ్చని రూపంలో దర్శనమిస్తుంది. తెలుగులో భావ కవిత్వంలో ‘ప్రకృతి కవిత్వం’ ఒక శాఖ ఉన్నట్లు విమర్శకులు గుర్తించారు గానీ, వేదాలు మొదలుకొని భారతీయ సాహిత్యంలో ప్రకృతి ఒక ప్రధాన వస్తువుగా ఉంది. పురాణేతిహాసాలలోనూ, ప్రబంధాలలోనూ ప్రకృతితి అనేక రంగులలో దర్శనమిస్తుంది. వాటిలో కథలో భాగంగా అప్పటి వర్ణన తన పాత్ర నిర్వహించింది. భావ కవిత్వంలో కథ ఉండదు. కేవలం కవి భావుకతలో ప్రకృతి ఒదిగిపోతుంది. ఆధునిక తెలుగు కవిత్వంలో అభ్యుదయ కవిత్వం లోనూ, విప్లవ కవిత్వం లోనూ ప్రకృతి ఎరుపురంగు ధరించి కనిపిస్తుంది. ప్రపంచీకరణ కాలంలో ప్రకృతి విధ్వంసమైపోతున్న తీరు తెలుగు కవిత్వంలో ఆర్ద్రంగా చిత్రింపబడుతున్నది. ప్రపంచీకరణ రాకతో రోడ్ల వెడల్పు, సెజ్‌ ల నిర్మాణం, బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం, బలిసిపోతున్న నగరీకరణల ప్రక్రియల ద్వారా ప్రకృతి నాశనమైపోతుంది. ప్రకృతిలో సహజ భాగంగా బతకవలసిన మనిషి, ప్రకృతిని అరూపం చేసుకుంటున్నాడు. కార్పొరేట్‌ శక్తులకు అడవులు, వాగులు, వంకలు, ఏరులు, కొండలు అదశ్యమైపోతున్నాయి.
ఈ విధ్వంసకాండను తెలుగు కవులు నాలుగు దశాబ్దాల నుంచి కవిత్వంగా మలుస్తున్నారు. కోట్ల వెంకటేశ్వర రెడ్డి ”ఆ తర్వాత” కావ్యంలో ప్రకృతి ఔన్నత్యాన్ని, ప్రకృతికి మనిషికి గల అనుబంధాన్ని చిత్రించారు.
”అలిగిపోతున్న మేఘాలకు/ పచ్చని తివాచీలు పరిచి/ స్వాగత గీతాలు పాడటం/ కరువు నేలల ప్రథమ కర్తవ్యం (పు. 9)” అని తొలి కవిత లోనే ప్రకృతి పరిరక్షణ బాధ్యతను గుర్తు చేశారు కవి.
కవి చెట్టును మనిషికి ఆదర్శంగా చూపించాడు. మనిషి చెట్టును ఎంత హింసించినా అది అచంచలంగా నిలబడి మనిషికి కావలసిన వాటినన్నింటినీ తన శరీరంలో ఏదీ దాచుకోకుండా త్యాగం చేస్తుందంటూ ‘ఆకు పచ్చని చెట్టు’ కవిత రాశారు.
”రక్త సంబంధాలూ/ భవ బంధాలు పలుచబడ్డచోట/ జ్ఞానబోధ చేసేదీ చెట్టే (పు. 97)” అనే వాక్యం గౌతమ బుద్ధుని జ్ఞాన సంపాదనను గుర్తు చేస్తున్నది. మానవ జీవితాలకు ఆయువు పోస్తున్నది ఆకుపచ్చని చెట్టేనని, దానిని అదశ్యం చేసుకుంటే మానవజాతి అదశ్యమౌతుందని కవి హెచ్చరించారు.
కాయలు కాచే చెట్టుకే రాళ్ల దెబ్బలు అని సామెత. వెంకటేశ్వర రెడ్డి ఈ విషయాన్ని చాలా కవితలలో ప్రస్తావించారు. మనుషుల రాతి దెబ్బలు తినడం చెట్టు అనుభవాలనడం, చెట్టును మానవీకరించడమే. మనిషికి చెట్టు విలువ ప్రయాణకాలంలో అనుభవంలోకి వస్తుంది. ఆకలైనప్పుడు గుర్తుకొస్తుంది. ముఖ్యంగా నిర్జనదారుల్లో నడిచేటప్పుడు మనిషికి చెట్టే దిక్కు. అందుకే కవి… ”ఒంటరి దారుల్లో/ చెట్టు ఇచ్చిన ఆతిథ్యం/ తలచుకున్నప్పుడల్లా/ కళ్ళలో ఓ వసంతం (పు. 143)” అని అన్నారు.
సంఘర్షణాత్మక జీవితంలో నలిగిపోయే మనిషికి కవి ధైర్యం చెప్పాలి. ప్రజల్ని భయపెట్టేవాడు ప్రజాకవి కాడు. కష్టాలకు కుమిలిపోకుండా నిలబడటం మానవ వ్యక్తిత్వంలో గొప్ప అంశం. వెంకటేశ్వర రెడ్డి చెట్టు తత్వాన్ని వర్ణించడం ద్వారా మనిషికి ధైర్యం చెప్పారు.
మనిషి స్వార్థపరత్వాన్ని నిరసించడానికి కవి ప్రకృతి త్యాగాన్ని వర్ణించాడు. కవి మనిషిని నిరంతరం ఎడ్యుకేట్‌ చేస్తుంటాడు. అది కవి కర్తవ్యం. సామాన్యుల కన్నా కవి ఒక మెట్టు పైన ఉన్నందుకు ఈ పని చేయాలి.
”వసంతాన్ని పంచే చెట్టు/ పండు రాలినందుకు కాదు/ పక్షి వాలనందుకు దుఃఖిస్తుంది/ వాన చినుకు దిగులంతా/ నేలజారి పడ్డందుకు కాదు/ పంట పొలంలో ఇంకిపోనందుకు (పు. 201)” అనడం చాలా అర్థవంతంగా ఉంది.
ప్రకృతిని ఉన్నతీకరించడం ఉబుసుపోక ఆదర్శం కాదు. అది సామాజిక అవసరం. ప్రకృతిని చూసే మనిషి చాలా అంశాలు నేర్చుకున్నాడు. దానిని అనుకరణ అన్నారు. అది నిజానికి ప్రకృతి దగ్గర మనిషి చదువుకోవడమే. ప్రకృతి పెద్ద పాఠశాల. పై వాక్యాలలో పాఠశాల లక్షణమే ధ్వనిస్తున్నది.
నోరున్న మనిషికి, నోరులేని చెట్టుకు తేడా చెప్పాడు కవి.
”విశ్వాసం లేనిది మనిషికే/ నీడనిచ్చినా పూల నిచ్చినా ఫలాలిచ్చినా/ భూగ్రహం మీద కత్తి కట్టింది మనిషే (పు. 213)”.
పగ, ద్వేషం, ప్రతీకారేచ్ఛ మనిషి లక్షణం. చెట్టుకు అవి ఉండవు. చెట్టు ఎంతసేపైనా తన అవయవాలను దానం చేయడమే దాని పని. ఎంత తేడా? ప్రకృతిని అధ్యయనం చేసిన కవి వెంకటేశ్వర రెడ్డి ప్రకృతి తత్వవేత్తగా కనిపిస్తారు.
”రాయి విసిరినా/ కత్తి దూసినా/ చెట్టు పగ బట్టదు/ కాయో పండో ఇచ్చి తీర్తది (పు. 224)” అని చెట్టు దానశీలతను శ్లాఘించారు.
”చెట్టెప్పుడూ మనిషిని బలహీనపరచదు” (పు. 238) అని హామీ ఇచ్చారు. చెట్టు మనిషికెప్పుడూ ఆదర్శమేనని ప్రకటించారు. కవి వ్యవసాయ రంగ నేపథ్యం గలవారు గనక, పల్లెటూరి నేపథ్యం ఉన్నవారు గనక, వ్యాపార నాగరికతకు దూరంగా ఉంటారు గనక అంత హదయ మార్దవం ఆయన కవిత్వంలో కనిపిస్తుంది. ప్రకృతి వర్ణన అంటే భౌతిక జీవితం నుండి మనిషిని పారదోలడం కాదు. మనిషిని చెయ్యి బట్టి చెట్టు కింద కూర్చోబెట్టడం. చెట్టు నరకడానికి మనిషి ఎత్తిన గొడ్డలిని పెరికి దూరంగా విసిరేయడం. ప్రకృతితో స్నేహం చేయించడం. వెంకటేశ్వర రెడ్డి కవిత్వం చదివితే మనిషి ప్రకతీకరింపబడతాడు. ప్రకృతిని పూజిస్తాడు. అలాంటి చైతన్యం కలిగించిన కవి చరితార్థుడు.
”ఆకు రాలినప్పుడల్లా చెట్టులా/ మనం మళ్లీ చిగురించాలి (పు. 271)” అన్న మాట మనిషికి ధైర్యాన్నిస్తుంది. ఆత్మహత్యల నుండి మనిషిని దూరం చేస్తుంది. జీవితంలోంచి పారిపోకుండా మనిషిని నిలబెడుతుంది. అవును, నాది మట్టిబుర్రే. ఇదిగో మదినిండా హరిత స్వప్నాలే (పు. 234)
– గుత్తా హరిసర్వోత్తమ నాయుడు
9542322669

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -