Monday, July 28, 2025
E-PAPER
Homeజాతీయంఎన్‌సీఈఆర్‌టీ ఆయుధంగా..

ఎన్‌సీఈఆర్‌టీ ఆయుధంగా..

- Advertisement -

– చరిత్రను వక్రీకరిస్తూ.. ద్వేషాన్ని చిమ్ముతూ
– ముస్లిం పాలకులే టార్గెట్‌గా పాఠ్యాంశాలు
– విద్యార్థుల మెదళ్లను కలుషితం చేస్తున్న వైనం
– మోడీ సర్కారు తీరుపై విద్యావేత్తల ఆగ్రహం
న్యూఢిల్లీ :
భారత్‌లోని పాఠశాల పాఠ్యపుస్తకాలలో విషయాల గురించి తుది నిర్ణయం తీసుకునే సంస్థ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌, రీసెర్చ్‌ సెంటర్‌ (ఎన్‌సీఈఆర్‌టీ) ఒక కీలు బొమ్మగా మారుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. హేతుబద్ధమైన దృక్పథాన్ని అందించటానికి బదులు ముస్లిం రాజులను విలన్లుగా చూపిస్తూ, చరిత్రను వక్రీకరిస్తూ, హిందూత్వను ప్రచారం చేసే ఒక సాధనంగా మారిపోయిందని మేధావులు ఆరోపిస్తున్నారు. గత కొన్నేండ్లుగా ఇదే తంతు కొనసాగుతోందనీ, మోడీ సర్కారు పాలనలో ఇది మరింత తీవ్రమైందని విమర్శిస్తున్నారు. విద్యార్థుల మెదళ్లను కలుషితం చేసేలా కొన్ని పాఠ్యాంశాలు ఉంటున్నాయని చెప్తున్నారు. విద్య కాషాయీకరణకు పెద్ద పీట వేస్తూ సమాజంలోని ఇతర మైనారిటీ మతాల పట్ల ద్వేషాన్ని పెంచేలా కొన్ని చాప్టర్లు ఉంటున్నాయని మేధావులు అంటున్నారు.

వాస్తవానికి చరిత్రలో ఒకే మతానికి చెందిన, వేర్వేరు ప్రాంతాల రాజులు యుద్ధాలు చేసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. మతాన్ని విస్తరించటమే కాకుండా.. అధికారం, సంపద కోసం యుద్ధాలు జరిగిన సందర్భాలున్నాయి. శివాజీ తొలి యుద్ధం చంద్రరావు మోరేతో జరిగింది. బాబర్‌ తన పాలన, రాజవంశ స్థాపనకు ఇబ్రహీం లోడిని ఓడించాడు. చోళ రాజులకు, చాళుక్య రాజుకు మధ్య యుద్ధం జరిగిన విషయాన్నీ మేధావులు గుర్తు చేస్తున్నారు. అయితే, ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల్లో చరిత్రను మరోకోణంలో చూపెడుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయనీ, ఇవి ఒక మతంపై విషం చిమ్మేలా, విద్వేషాన్ని కలిగించేలా ఉంటున్నాయని వారు అంటున్నారు. మొఘల్‌ రాజులను చెడుగా చిత్రీకరించి, విద్యార్థుల్లో వారి పట్ల ద్వేషం కలిగించేలా పాఠ్యాంశాలను మారుస్తున్నారని వివరిస్తున్నారు. అంతేకాదు.. అప్పటి ముస్లిం రాజులను ఇప్పటి ముస్లింలతో, అప్పటి హిందూ రాజులను ఇప్పటి హిందువులతో గుర్తిస్తూ, పోలుస్తూ హిందూత్వ శక్తులు చేస్తున్న దుష్ప్రచారం పైనా మేధావులు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ముస్లిం రాజులను రాక్షసులుగా చిత్రీకరిస్తూ, వారి పాలనా కాలంలో జరిగిన దుర్ఘటనలు ఏవైనా ఉంటే.. వాటిని నేటి ముస్లింలకు ఆపాదిస్తున్న సందర్భాలు బాధాకరమని వివరిస్తున్నారు.

ఇక బాబర్‌ రామాలయాన్ని కూల్చివేశాడని చెప్పే హిందూత్వ శక్తులు.. ఆయన దేవాలయాల విషయంలో పెద్ద మనసుతో ఆలోచించాడన్న విషయాన్ని విస్మరిస్తున్నాయని చరిత్రకారులు అంటున్నారు. ఢిల్లీలోని నేషనల్‌ మ్యూజియంలో ఉన్న బాబార్‌ వీలునామాలో కీలకమైన విషయాలున్నాయని చెప్తున్నారు. దేవాలయాలు నాశనం కాకుండా, గోవులను వధించకుండా చూసుకోవాలని హుమాయున్‌ను బాబర్‌ ఆదేశించినట్టు అందులో ఉన్నదని చరిత్రకారులు వివరిస్తున్నారు. రాజ్య నిర్మాణంలో భాగంగా ఆ సమయంలో మెజారిటీగా ఉన్న హిందూవుల మనోభావాలను గౌరవించాలనే ఉద్దేశంతో ఆయన ఇలా వ్యవహరించాడనీ, అయితే వీటి గురించి మాత్రం పాఠ్యాంశాల్లో లేవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిత్తోర్‌గఢ్‌లో 30వేల మందిని ఊచకోత కోసి, దేవాలయాలను ధ్వంసం చేయాలంటూ బాబర్‌ ఇచ్చిన ఆదేశాన్ని ఎన్‌సీఈఆర్‌టీ ప్రస్తావి స్తుంది. అయితే, ఆ సమయంలో రాజ్‌పుత్‌ రాజు భగవంత్‌ దాస్‌.. అక్బర్‌కు మంచి మిత్రుడనీ, ఇలా చాలా మంది హిందూ రాజులు ఇలాంటి స్నేహాలను కలిగి ఉన్నారన్న విషయాలను చరిత్రకారులు గుర్తు చేస్తున్నారు.

ఇక చోళులు, చాళుక్యుల మధ్య జరిగిన యుద్ధంలో గెలిచిన చోళులు.. మొత్తం నగరాన్ని నాశనం చేశారు. అనేక జైన దేవాలయాలను ధ్వంసం చేశారు. ఇక మరాఠా చక్రవర్తి శివాజీకి చెందిన సైన్యం సూరత్‌లో ప్రజలను దోచుకోవటం, దహనం చేయటం, గాయాలపాల్జేయటం గురించి బాల సామంత్‌ రాసిన శివకళ్యాణ్‌ రాజా చెప్తుంది. ఎన్‌సీఈ ఆర్‌టీ చరిత్ర పాఠ్యపుస్తకాల్లో ముస్లిం రాజులను మాత్రమే టార్గెట్‌ చేసేలా ప్రజంటేషన్‌ ఉంటున్నదని విద్యా వేత్తలు చెప్తున్నారు. బాబర్‌, అక్బర్‌, ఔరంగజేబులను క్రూరులుగా హైలెట్‌ చేశారు కానీ.. వారి పాలనలో హిందువులు, వారి దేవాలయాలకు జరిగిన మంచిని ప్రస్తావించినట్టు కనబడలేదని అంటున్నారు. మొఘల్‌ పాలనలో జజియా పన్ను అంతటా విధించలేదనీ, 1560లో అక్బర్‌ అధికారంలోకి వచ్చిన రెండు, మూడేండ్లలో దీనిని ఉపసంహరించు కున్నాడు. అయితే, జజియా పన్ను గురించే ప్రస్తావిస్తూ, మొఘల్‌ పాలనను చెడుగా చిత్రీకరించారని మేధావులు అభిప్రాయపడుతున్నారు. చరిత్ర అంశాల్లోకి వెళ్లినపుడు దానిని ఒక కోణంలోనే పరిచయం చేయొద్దనీ, జరిగిన మంచీ, చెడులు.. రెండింటినీ ప్రస్తావించాలని చరిత్రకారులు సూచిస్తున్నారు.

చరిత్ర వక్రీకరణ..
ఎన్‌సీఈఆర్‌టీ 8వ తరగతి కొత్త సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాన్ని విడుదల చేసిన సందర్భంగా ఈ విషయాలు మళ్లీ చర్చకు వస్తున్నాయి. భారతీయ చరిత్రలో 13వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం వరకు సవరించిన అంశాలు ఇందులో ఉంటాయి. ఇందులో ఢిల్లీ సల్తనేట్‌, మొఘల్‌ రాజులు గురించి తీవ్రంగా చిత్రీకరించారు. ఆలయ విధ్వంసాలు, విగ్రహాలను నాశనం చేశారంటూ లెక్కకు మించి గణాంకాలు చూపించారని మేధావులు చెప్తున్నారు. ఔరంగజేబు దేవాలయాలను ధ్వంసం చేశాడని చెప్తున్న పాఠ్యాంశాలలో ఎలాంటి నిర్దిష్ట ఆధారం లేదని ఆరోపిస్తున్నారు. కొందరు చరిత్రకారులు మాత్రం ఔరంగజేబు లెక్కకు మించి హిందూ దేవాలయాలకు అందించిన విరాళాల గురించి చెప్తుండటం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -