జావెలిన్ స్టార్కు ఎనిమిదో స్థానం
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్
టోక్యో (జపాన్) : 2025 అథ్లెటిక్స్ ప్రపంచ చాంపియన్షిప్స్. నీరజ్ చోప్రా ఒలింపిక్ చాంపియన్గా నిలిచిన టోక్యో స్టేడియం వేదిక. టైటిల్ రేసులో డిఫెండింగ్ వరల్డ్ చాంపియన్ నీరజ్ చోప్రా, ఒలింపిక్ చాంపియన్ అర్షద్ నదీమ్, సీజన్ ఉత్తమ త్రోయర్ అండర్సన్ పీటర్స్. దీంతో సహజంగానే జావెలిన్ త్రోపై అంచనాలు భారీగా ఉన్నాయి. 2021 నుంచి వరుసగా 26 ఈవెంట్లలో నిలకడగా టాప్-2లో నిలిస్తూ వచ్చిన నీరజ్ చోప్రా.. గురువారం టోక్యోలో తొలిసారి నిరాశపరిచాడు. గురువారం జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ చోప్రా ఎనిమిదో స్థానంలో నిలిచి పతకానికి దూరమయ్యాడు. తొలి ప్రయత్నంలో 83.65 మీటర్లు, ఆ తర్వాత 84.03 మీటర్లు, 82.86 మీటర్ల దూరం బల్లెంను విసిరిన నీరజ్ చోప్రా.. పోటీలో నిలిచేందుకు ఐదో ప్రయత్నంలో 85.54 మీటర్ల కంటే మెరుగైన త్రో విసరాలి. కానీ ఐదో ప్రయత్నంలో నీరజ్ చోప్రా ఫౌల్ అయ్యాడు. దీంతో పతక రేసు నుంచి నిష్క్రమించాడు. ఫైనల్లో పోటీపడిన మరో భారత అథ్లెట్ సచిన్ యాదవ్ 86.27 మీటర్ల కెరీర్ అత్యుత్తమ ప్రదర్శనతో నాల్గో స్థానంలో నిలిచాడు. అండర్సన్ పీటర్స్ 87.38 మీటర్లతో రెండో స్థానంలో నిలువగా.. వాల్కోట్ (ట్రినిడాడ్ అండ్ టొబాగో) 88.16 మీటర్ల త్రోతో వరల్డ్ చాంపియన్గా అవతరించాడు. పాక్ అథ్లెట్ అర్షద్ నదీమ్ 82.73 మీటర్లతో పదో స్థానానికి పరిమితమయ్యాడు.