– ఆహ్వానాల పంపిణీ లోపాలు, అధికారుల గైర్హాజరు
నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలం రాయిచెడు గ్రామంలో ఏప్రిల్ 2న జరిగిన గ్రామ సభలో మరొక ఆశ్చర్యకర పరిణామం చోటుచేసుకుంది. ఇంటింటికి ఆహ్వానం అందించాల్సిన బాధ్యతపై ప్రశ్నలు తలెత్తగా, “సిబ్బంది లేరు…ఈ విషయాన్ని ఇప్పటికే మండల అధికారులకు తెలియజేశాను” అని పంచాయతీ కార్యదర్శి గ్రామ సభ మధ్యలోనే గట్టిగా చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
నిబంధనల ప్రకారం ప్రతి ఇంటికి ఆహ్వానం అందించాల్సి ఉన్నప్పటికీ, సిబ్బంది కొరతను కారణంగా చూపించడం అధికారుల పనితీరుపై అనుమానాలను రేకెత్తిస్తోంది. గ్రామ సభ వంటి ముఖ్యమైన కార్యక్రమానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడం, బాధ్యతలను సరైన రీతిలో నిర్వర్తించకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది.
ఇక గ్రామ సభల్లో సంబంధిత శాఖల అధికారులు గైర్హాజరు కావడం, తగిన ఏర్పాట్లు లేకపోవడం, వేసవి కాలం అయినప్పటికీ త్రాగునీటి వంటి కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడం ప్రజలను ఇబ్బందులకు గురిచేసింది. ఈ పరిస్థితులు గ్రామ స్థాయి పాలనలో లోపాలను స్పష్టంగా బయటపెడుతున్నాయి.
పంచాయతీ కార్యదర్శి బహిరంగంగా సిబ్బంది లేరని చెప్పడం ఒకవైపు సమస్య తీవ్రతను తెలియజేస్తే, మరోవైపు మండల స్థాయి అధికారుల నిర్లక్ష్యాన్ని కూడా వెలుగులోకి తెచ్చింది. ఈ అంశంపై ఉన్నతాధికారులు దృష్టి సారించి, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.



