న్యూఢిల్లీ : బంధుప్రీతి, స్వీయాభివృద్ది అనేవి ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత హేయమైనవని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా హర్యానా ప్రభుత్వ గృహ నిర్మాణ సంస్థ గవర్నింగ్ బాడీ సభ్యునికి, ఆయన అనుచరుడికి చేసిన రెండు ఫ్లాట్ల కేటాయింపులను రద్దు చేసింది. ఈ కేటాయింపుల ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ పంజాబ్, హర్యానా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్లతో కూడిన బెంచ్ తోసిపుచ్చింది. గవర్నింగ్ బాడీ సభ్యునికి, ఆయన అనుచరునికి ఇచ్చిన కేటాయింపులు ఏకపక్షంగా, పక్షపాతంగా వున్నాయని, సొసైటీ పెట్టుకున్న సొంత అర్హతా ప్రమాణాలనే ఉల్లంఘించేలా వున్నాయని బెంచ్ పేర్కొంది.
బంధుప్రీతి, స్వీయాభివృద్ధి ప్రజాస్వామ్య వ్యవస్థకు అసహ్యకరమైనవి. పైగా, ప్రభుత్వ సర్వీసులో వున్న వారు సొసైటీలో వున్నపుడు ఇలాంటివి జరగడం మరింత హేయకరం. పారదర్శక కేటాయింపుల ద్వారా సొసైటీ సభ్యులకు గృహ కేటాయింపులు జరగాలని బెంచ్ పేర్కొంది. అత్యధిక విలువ కలిగిన రెండు సూపర్ డీలక్స్ ఫ్లాట్ల కేటాయింపులను సవాలు చేస్తూ హుడా సభ్యుడైన దినేష్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేటాయింపులు జరిగిన ఇద్దరు కూడా అందుకు అర్హులు కారని, వారి పట్ల పక్షపాతం చూపారని దినేష్ కుమార్ విమర్శించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో బంధుప్రీతి పనికిరాదు : సుప్రీం వ్యాఖ్యలు
- Advertisement -
- Advertisement -



