37 దేశాల నుంచి రీకాల్
శిశు పౌష్టికాహార ప్రోడక్ట్స్లో హానికర పదార్థాలు ఉండొచ్చన్న అనుమానంతోనే..
తన అధికారిక వెబ్సైట్లో వెల్లడించిన కంపెనీ
జెనీవా : ప్రముఖ ఆహార-పానీయాల సంస్థ నెస్లే కీలక నిర్ణయం తీసుకుంది. తమ కంపెనీకి చెందిన కొన్ని శిశుపౌష్టికాహార ఉత్పత్తుల్లో హానికర పదార్థాలు ఉండొచ్చని గుర్తించిన నేపథ్యంలో వాటిని ప్రపంచ మార్కెట్ నుంచి వెనక్కి తీసుకుంది. మొత్తం 37 దేశాల నుంచి వీటిని వెనక్కి రప్పిస్తున్నది. అయితే ఈ జాబితాలో భారత్ పేరు లేదు. ఈ మేరకు నెస్లే ఒక ప్రకటన చేసింది. ఈ ప్రకటన ప్రకారం.. ఎస్ఎంఏ ఇన్ఫాంట్ ఫార్ములా, ఫాలో-ఆన్ ఫార్ములాలోని కొన్ని బ్యాచ్లు శిశువులకు సురక్షితం కావు. ఈ ఉత్పత్తుల్లో సెర్యూలైడ్ అనే హానికరమైన టాక్సిన్ ఉండే అవకాశమున్నదని గుర్తించడంతో ఈ రీకాల్ను ప్రారంభించామని వివరించింది. ఈ సమాచారాన్ని నెస్లే తన అధికారిక వెబ్సైట్లో వెల్లడించింది.
సెర్యూలైడ్కు గురైతే వికారం, వాంతులు వంటి ఆరోగ్య సమస్యలు కలగవచ్చని కొన్ని నివేదికలు చెప్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ ఉత్పత్తులు వాడిన వినియోగదారుల్లో ఎలాంటి ప్రతికూల ప్రభావాలూ నమోదు కాలేదని నెస్లే స్పష్టం చేసింది. ఇది కేవలం ముందస్తు జాగ్రత్త చర్యగా తీసుకున్న నిర్ణయమని వివరించింది. కాగా నెస్లే తాజా రీకాల్తో దాదాపు 10 ఫ్యాక్టరీల్లో తయారైన 800కు పైగా ఉత్పత్తులను ప్రభావితం చేస్తోంది. యూరప్, ఆసియా, అమెరికాలలో ఉన్న 37 దేశాలలో ఈ ఉత్పత్తులను మార్కెట్ల నుంచి ఉపసంహరించా లని నెస్లే ఆదేశించింది. ఆసియాలో ప్రస్తుతం హాంకాంగ్ మాత్రమే ఈ జాబితాలో ఉన్నది. భారత్ మాత్రం ఈ జాబితాలో లేదు. అయితే దర్యాప్తు కొనసాగుతున్నదనీ, ఈ జాబితాను నవీకరిస్తామని కంపెనీ తెలిపింది.



