అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యత సర్పంచ్లకు
సర్పంచ్ ఛైర్మన్గా 11 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు
నవతెలంగాణ – మల్హర్ రావు
తెలంగాణలోని గ్రామ పంచాయతీల సర్పంచ్లకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అధికారాలు అప్పగించనుందని తెలుస్తోంది. ఇకపై అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను పూర్తిగా సర్పంచ్లే చూసుకోనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. పౌష్టికాహారం పంపిణీలో జరుగుతున్న అక్రమాలను అరికట్టి, అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. గతంలో రెండేళ్లపాటు గ్రామాల్లో ఎన్నికైన పాలకవర్గాలు లేకపోవడంతో అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణ పూర్తిగా గాడితప్పింది.చాలాచోట్ల పౌష్టికాహారం పక్కదారి పడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది.
ఈ నేపథ్యంలో ఇటీవలే కొలువుదీరిన కొత్త పంచాయతీ పాలకవర్గాలకు ఈ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సర్పంచ్ల నేతృత్వంలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయనుంది. ఈ కమిటీకి సర్పంచ్ ఛైర్మన్గా వ్యవహరించనుండగా, మొత్తం 11 మంది సభ్యులు ఉంటారు. అంగన్వాడీ టీచర్ కన్వీనర్గా, ఏఎన్ఎం, స్కూల్ సైన్స్ టీచర్, ఒక రిటైర్డ్ ఉద్యోగి, చిన్నారుల తల్లులు ఇందులో సభ్యులుగా ఉంటారు.
ఈ కమిటీ ప్రతి నెలా కేంద్రాలకు అందుతున్న బియ్యం, పప్పు, బాలామృతం, గుడ్లు, పాలు వంటి సరుకుల నాణ్యతను, పంపిణీని తనిఖీ చేస్తుంది. ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా గర్భిణులు, బాలింతలకు అందుతున్న భోజనాన్ని కూడా పరిశీలిస్తుంది. లక్షల రూపాయల విలువైన పోషకాహారం లబ్ధిదారులకు సక్రమంగా అందేలా చూడటమే ఈ కమిటీ ప్రధాన విధి.



