– తుంగతుర్తిలో లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీకి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 14న తుంగతుర్తి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.4 లక్షల కొత్త రేషన్ కార్డులను ఇవ్వనున్నారు. వీటితో అదనంగా 11.30 లక్షల మంది నిరుపేదలకు ప్రయోజనం చేకూరనుంది. గడిచిన ఆరు నెలల కాలంలో రాష్ట్రంలో 41 లక్షల మందికి ప్రభుత్వం కొత్తగా రేషన్ పంపిణీ చేసింది. కొత్తగా జారీ చేసిన రేషన్కార్డులతో కలిపి రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య 94,72,422 కు చేరను ంది. మొత్తంగా 3.14 కోట్ల మందికి లబ్ది చేకూరనుంది. ప్రస్తుతం రేషన్ కార్డుల్లో ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున బియ్యాన్ని అందిస్తున్నది.
అర్హులైన వారి నుంచి స్వీకరించిన దరఖాస్తుల పరిశీలనను ఈ నెల 13 వరకు పూర్తి చేయాలని పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి తెల్ల రేషన్ కార్డుల సంఖ్య 89.73 లక్షలుంది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక వీటికి అదనంగా 49 వేల తెల్ల రేషన్ కార్డులను జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో 2.81 కోట్ల మందికి దొడ్డు బియ్యం సరఫరా చేసేందుకు రూ.10 వేల కోట్లు ఖర్చు చేసేది. అయితే కార్డుల సంఖ్య పెంచడంతో పాటు తెల్ల రేషన్ కార్డులకు సన్న బియ్యం సరఫరా చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఖర్చు రూ.13 వేల కోట్ల వరకు పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.