కేటీఆర్పై అవాస్తవ వార్తలు ప్రసారం చేస్తున్నారని ఆరోపణ
బీఆర్ఎస్ నేత గెల్లు శ్రీనివాస్ అరెస్ట్
దాడి ప్రాంతాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ
నవతెలంగాణ-అంబర్పేట/బంజారాహిల్స్
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై అవాస్తవ వార్తలు ప్రసారం చేస్తున్నారనే ఆరోపణలతో ఆగ్రహించిన బీఆర్ఎస్ కార్యకర్తలు మహాన్యూస్ టీవీ చానల్ కార్యాలయంపై దాడి చేశారు. వాహనాలు ధ్వంసం చేశారు. వివరాల్లోకెళ్తే.. శనివారం మహాన్యూస్ కార్యాలయం వైపు ఒక్కసారిగా గుంపులా వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలు ముందుగా ఆఫీసు ఎదురుగా ఉన్న కార్లపై దాడికి దిగారు. ”ఖబడ్దార్” అంటూ నినాదాలు చేస్తూ రాళ్లు రువ్వారు. అద్దాలు పగలగొట్టారు. అనంతరం కార్యాలయం లోపలకు చొచ్చుకెళ్లి రిసెప్షన్తోపాటు స్టూడియోను ధ్వంసం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తల దాడితో ఉద్యోగులంతా భయాందోళనకు గురయ్యారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేటీఆర్పై మహాన్యూస్లో అభ్యంతరకర విషయాలు వస్తున్నాయని వారు ఆరోపించారు. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారన్నారు. రామన్నపైనే కామెంట్స్ చేస్తారా.. అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వారు అక్కడి నుంచి ఎవరికి వారుగా వెళ్లిపోయారు.
దాడి అనంతరం మహా టీవీ అధినేత వంశీ విలేకరులతో మాట్లాడారు. తాము అడ్డగోలుగా కథనాలను ప్రసారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని.. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలపొచ్చని.. ఇలా దాడులు చేయడం సరైన విధానం కాదన్నారు. ఈ విషయంలో తాను వెనక్కి తగ్గబోనని.. దాడి చేసిన వ్యక్తులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తర్వాత ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేత గెల్లు శ్రీనివాస్ను బీఆర్ఎస్ భవన్లో పోలీసులు అరెస్టు చేశారు.
న్యూస్ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రులు
మహా టీవీ న్యూస్ కార్యాలయంపై దాడి జరిగిన నేపథ్యంలో మంత్రులు రంగంలోకి దిగారు. ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మహాటీవీ కార్యాలయాన్ని సందర్శించారు. దాడి విషయాలను మంత్రులకు ఛానల్ అధినేత వివరించారు. దాడిని మంత్రులు ఖండించారు. ఈ దాడి వెనుక ఉన్న వారందరినీ తప్పకుండా గుర్తిస్తామని.. చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మంత్రుల వెంట కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు -సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ
మహాన్యూస్ కార్యాలయంపై జరిగిన దాడిని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ తీవ్రంగా ఖండించారు. ఆయన కార్యాల యాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దేశంలో ఎవరికీ వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు లేదన్నారు. రాజ్యాంగ హక్కులను కాలరాయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. మీడియా స్వేచ్ఛను భయపెట్టే చర్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని స్పష్టం చేశారు. ఆయన వెంట సీపీఐ(ఎం) కంట్రోల్ కమిటీ చైర్మెన్ డిజి.నర్సింహారావు, నగర నాయకులు, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ ఉన్నారు. సీపీఐ జాతీయ నాయకులు నారాయణ కూడా కార్యాలయాన్ని పరిశీలించి మాట్లాడారు. ”ఫర్నీచర్ ధ్వంసం, ఆస్తి నష్టం వంటి చర్యలు హింసాత్మకంగా ఉండటంతోపాటు చట్టవ్యతిరేకం. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలి. అమాయకులను ఇరికించొద్దు..” అని అన్నారు.