ముధోల్ లో గట్టి భద్రత: జిల్లా ఎస్పీ జానకి షర్మిల
నవతెలంగాణ – ముధోల్
నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ గ్రామంలో గణేష్ నిమజ్జన శోభాయాత్రలు శాంతియుతంగా, సురక్షితంగా జరగడానికి జిల్లా పోలీసు శాఖ అన్ని విధాలైన ఏర్పాట్లు చేయటం జరిగిందని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. ముధోల్ మంగళవారం జరిగే గణేష్ శోభాయాత్ర కోసం సుమారు 200 మంది పోలీసు అధికారులు, సిబ్బంది నియమించబడి పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. గణేష్ బందోబస్తు విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందితో ప్రత్యేకంగా జిఎం గార్డెన్లో సమావేశమై మధ్యాహ్నం ఎస్పీ పలు సూచనలు చేశారు.
శాంతి భద్రతలు కాపాడడమే మన ప్రధానకర్తవ్యమని, ప్రతి ఒక్కరు తమ తమకు కేటాయించిన ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గణేష్ శోభాయాత్రలో పాల్గొనే భక్తుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ రూట్ మ్యాప్ ప్రకారం శోభాయాత్ర సాఫీగా కొనసాగే విధంగా చూడాలన్నారు. శోభాయాత్ర మార్గాల్లో ఎలాంటి అవాంతరాలు లేకుండా బారికేడింగ్, ట్రాఫిక్ డైవర్షన్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లోనూ పోలీసు విభాగం తరపున బలమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ముధోల్ గ్రామంలో ముఖ్య రహదారులపై ట్రాఫిక్ డైవర్షన్లు అమలు చేస్తూ, ప్రత్యేక పోలీసు బృందాలను నియమించినట్లు పేర్కొన్నారు.
శాంతి భద్రతల భంగం కలిగించే ఎటువంటి సంఘటనలుజరగకుండా సమన్వయంతో, ఓపికతో పనిచేయాలని సూచించారు.గణేష్ శోభాయాత్ర రూట్ను పరిశీలించి, అవసరమైన సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా జనసంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాలు, నిమజ్జన ఘాట్లు, ట్రాఫిక్ జంక్షన్ల వద్ద అదనపు బందోబస్తు అమలు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి,భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ ఐపీఎస్, నిర్మల్ ఏఎస్పీ రాజేష్ మీన ఐపిఎస్, ఇన్స్పెక్టర్లు, పోలీసు సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.