నవతెలంగాణ -హైదరాబాద్ : అమెరికాతో చర్చలకు అవకాశమే లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ పేర్కొన్నారు. వచ్చేవారం ఇరాన్తో చర్చలు జరపాలని యోచిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనను ఖండించారు. గురువారం స్థానిక మీడియాతో ఆయన మాట్లాడారు. అమెరికాతో చర్చలు తమకు ప్రయోజనకరంగా ఉన్నాయో లేదో అంచనా వేస్తోందని అన్నారు. దాడులతో అణుకేంద్రాలకు జరిగిన నష్టం తక్కువేమీ కాదని అరాఘ్చీ పేర్కొన్నారు. సంబంధిత అధికారులు అక్కడి పరిస్థితిని అంచనా వేస్తున్నారని అన్నారు. ఇది ఇరాన్ భవిష్యత్తు దౌత్య వైఖరిని స్పష్టం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇజ్రాయిల్, అమెరికాలు ఇరాన్ అణుస్థావరాలపై దాడిచేయడంతో గతంలో జరిగిన ఐదు రౌండ్ల చర్చలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇరాన్ అణ్వాయుధాల సామర్థ్యాన్ని అడ్డుకునేందుకు ఈ దాడులు చేసినట్లు అమెరికా, ఇజ్రాయిల్లో ఆరోపించాయి. అయితే తమ అణు కార్యక్రమం పూర్తిగా పౌర వినియోగానికి ఉద్దేశించబడిందని ఇరాన్ స్పష్టం చేసింది.
అమెరికాతో చర్చలకు అవకాశమే లేదు : ఇరాన్
- Advertisement -
- Advertisement -