బహదూర్పేటలో నిరసన దీక్షలు
నవతెలంగాణ – ఆలేరు టౌను
ఆలేరు మున్సిపాలిటీ వద్దు, బహుదూర్ పేట గ్రామపంచాయతీ ముద్దు, బహదూర్పేట గ్రామ ప్రజల నిరవధిక నిరసన దీక్షలు శనివారం చేపట్టారు. ఆలేరు మున్సిపాలిటీలో విలీనం చేసిన బహదూర్పేట గ్రామాన్ని తిరిగి ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామ ప్రజలు నిరవధిక నిరసన దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. గత ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో బహదూర్పేటను ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పాటు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారని, అయితే ఆ హామీని పూర్తిగా మర్చిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామపంచాయతీ నుంచి మున్సిపాలిటీలో విలీనం చేసిన తర్వాత ,అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదని, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా పరిస్థితి నెలకొందని విమర్శించారు. ఉపాధి అవకాశాలు లేక గ్రామ ప్రజలు బతుకుతెరువు కోసం హైదరాబాద్కు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని, మున్సిపాలిటీలో చేరిన తర్వాత ఇంటి పన్ను, నల్ల పన్నుల భారం భరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలుమార్లు ఎమ్మెల్యేకు, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి, జిల్లా కలెక్టర్కు వినతిపత్రాలు అందజేశామని, అయినప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు తమ గ్రామాన్ని చిన్నచూపుగా చూస్తున్నారని ఆరోపించారు.
తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ను బహిష్కరిస్తామని గ్రామ ప్రజలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దొంతుల సరేష్, ముద్దపాక విజయ్,పర్శి నరేశ్, జంపాల అంజయ్య, కుళ్ళ సాయిలు, వస్పరి బాలనరయ్య, ఖమ్మంపల్లి నరేశ్, హరి ప్రసాద్, దొంతుల రాము, బండ్రు సంపత్, మహిళా లు ఖమ్మంపల్లి బాలమ్మ, కర్రే యాదమ్మ, కోరుటూరి పద్మ, పల్లె రేణుక, వస్పరి యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.



