Thursday, June 26, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరైతులకు నోటీసులు

రైతులకు నోటీసులు

- Advertisement -

– మామునూరు విమానాశ్రయ భూముల్లో సాగు చేయొద్దనడం పట్ల రైతుల ఆగ్రహం
– నష్టపరిహారం పంపిణీలో తీవ్ర జాప్యం
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి

వరంగల్‌ మామునూరు విమానాశ్రయం నిర్మాణానికి సేకరించనున్న ప్రతిపాదిత 253 ఎకరాల్లో పంటలు సాగు చేయొద్దని వరంగల్‌ ఆర్డీఓ రైతులకు నోటీసులు ఇవ్వడం పట్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వానాకాలం సాగు ప్రారంభమైన నేపథ్యంలో మామునూరు విమానాశ్రయానికి అవసరమైన భూములను ఖిలావరంగల్‌ మండలం గాడిపల్లి, గుంటూరుపల్లి, నక్కలపల్లి గ్రామాల నుంచి సేకరించారు. రైతులకు నష్టపరిహారం ఇవ్వడంలో జాప్యమవుతున్న నేపథ్యంలో రైతులు తమ భూముల్లో పంటల సాగుకు సన్నద్ధమయ్యారు. నష్టపరిహారం ఇవ్వకుండా పంటలు సాగు చేయొద్దనడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణకు రూ.205కోట్లను కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నిధులను సత్వరమే విడుదల చేస్తే భూనిర్వాసితులకు చెల్లింపులు జరపడానికి వీలుంటుంది. భూములను ఏఏఐకు స్వాధీనపరిస్తే వెంటనే విమానాశ్రయం పనులు ప్రారంభమయ్యే అవకాశముంది.
నష్టపరిహారంలో తీవ్ర జాప్యం..
మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు నిర్మాణానికి సేకరించిన భూముల రైతులకు నష్టపరిహారం ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరగడం పట్ల రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నష్టపరిహారం ఇవ్వకుండానే పంటలు వేయొద్దని నోటీసులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రాంతంలో బయట మార్కెట్‌లో ఎకరం రూ.2 కోట్ల ధర ఉందని, అధికారులు మాత్రం ఎకరాకు రూ.1.20కోట్లు నిర్ణయించారని తెలిపారు. ఒకవైపు వానాకాలం సాగు ప్రారంభమైన నేపథ్యంలో పంటలు వేస్తామని రైతులు భీష్మించుకు కూర్చోవడంతో అధికారుల్లో ఆందోళన ప్రారంభమైంది.
30 నెలల్లో పూర్తి..
మామునూరు విమానాశ్రయానికి సంబంధించి భూ సేకరణ పూర్తి చేసిన భూములను ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ)కి అప్పగిస్తే 30 నెలల్లో టర్మినల్స్‌, అదనపు రన్‌వే నిర్మాణాన్ని పూర్తి చేసి విమానాల రాకపోకలను ప్రారంభించనున్నట్టు పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. రూ.500 కోట్లతో విమానాశ్రయం పనులు చేపట్టడానికి సంబంధిత శాఖ సిద్ధంగా ఉన్నట్టు మంత్రి తెలిపారు. ప్రస్తుతమున్న 1,800 మీటర్ల రన్‌వేను 2,800 మీటర్ల రన్‌వేగా విస్తరించనున్నారు. టర్మినల్స్‌తోపాటు మౌలిక వసతులను కల్పించనున్నారు. మామునూరు విమానాశ్రయం నిర్మాణం పూర్తయి రాకపోకలు ప్రారంభమైతే వరంగల్‌ జిల్లాలో కాకతీయ మెగా టెక్స్‌టైల్స్‌ పార్క్‌లో మరిన్ని పరిశ్రమలను స్థాపించడానికి అవకాశం ఉంది. రియల్‌ ఎస్టేట్‌ రంగం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మరింతగా విస్తరించే అవకాశాలున్నాయి. అదే విధంగా మామునూరు విమానాశ్రయం కనెక్టివిటీని విస్తరించడంలో భాగంగా హైదరాబాద్‌ వయా కాజీపేట శివారు నుంచి మామునూరు విమానాశ్రయానికి నాలుగు లేన్ల రోడ్డును విస్తరించడానికి ప్రతిపాదనలూ ఉన్నాయి. అంతేకాకుండా వరంగల్‌-ఖమ్మం జాతీయ రహదారిని సైతం విస్తరించడమే కాకుండా కాకతీయ మెగా టెక్స్‌టైల్స్‌ పార్క్‌ నుంచి విమానాశ్రయం వరకు నాలుగు లేన్‌ల రోడ్డును నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -